వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్, మహేశ్వరం నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. వరదలా వచ్చిన అశేష జన ప్రవాహంతో రెండు సభల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ప్రాంగణాల బయటే ఉండాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రసంగించినంత సేపు జనం శ్రద్ధగా ఆలకించారు.
మధ్యమధ్యలో పార్టీ శ్రేణుల ఈలలు, కేకలు, జై కేసీఆర్.. జైజై బీఆర్ఎస్.. కారుగుర్తుకే మన ఓటు.. అన్న నినాదాలు దద్దరిల్లాయి. గులాబీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో దారులన్నీ గులాబీ మయమయ్యాయి. కులవృత్తుల వేషధారణలు, బతుకమ్మలు, బోనాలతో మహిళలు సందడి చేయగా, పండుగ వాతావరణం నెలకొన్నది. రెండు సభల్లోనూ కళాకారుల ఆటపాటలు సభికులను ఉర్రూతలూగించాయి.