షాబాద్, మే 17: తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గొర్రెలతో గొల్ల, కుర్మల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. తొలి విడుత గొర్రెల పంపిణీ విజయవంతం కాగా, రెండో విడుత గొర్రెల పంపిణీకి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. వచ్చే వారంలో గొర్రెల పంపిణీని ప్రారంభించి, సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికను రూపొందించారు. జిల్లాలోని గొల్ల, కురుమల సంఘాల్లో మొత్తం 42వేల మంది సభ్యులు ఉండగా, మొదటి విడుతలో 12వేల మందికి సబ్సిడీ గొర్రెలు అందాయి. రెండో విడుతలో మిగిలిన 30వేల మందికి గొర్రెలను అందించేందుకు జిల్లా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, కర్ణాటకలోని బీదర్, బాగల్కోట్ జిల్లాల్లో గొర్రెలను కొనుగోలు చేయడంతో పాటు రవాణా, పంపిణీ బాధ్యతలను రాష్ట్ర సర్కార్ జిల్లాస్థాయి అధికారులకు అప్పజెప్పింది. గొర్రెల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పర్యవేక్షించేందుకు జిల్లాకు 6 ప్రత్యేక బృందాలను నియమించింది. లబ్ధిదారుల వాటాధనాన్ని వారి ఖాతాల నుంచి కలెక్టర్ ఖాతాలోకి బదిలీ చేయనున్నారు.
గొల్ల, కుర్మలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. గొర్రెల కొనుగోలుకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించింది. మొత్తం ప్రక్రియ పర్యవేక్షణకు 6 ప్రత్యేక బృందాలను నియమించింది. గొర్రెల కోసం లబ్ధిదారులు తమ వాటాధనాన్ని చెల్లించే విధానంలో కూడా మార్పులు తీసుకువచ్చింది. డీడీల రూపంలో కాకుండా బ్యాంకు సొంత ఖాతా నుంచి కలెక్టర్ ఖాతాలోకి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డిజిల్లాలో మొత్తం 42వేల మంది గొల్ల, కుర్మ సంఘం సభ్యులు ఉండగా, మొదటి విడుతలో 12వేల మందికి సబ్సిడీ గొర్రెలు పంపిణీ చేశారు. రెండో విడుతలో మిగిలిన 30వేల మందికి గొర్రెలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పశువైద్యాధికారులు గొల్ల, కుర్మ సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి వద్ద నుంచి ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా, కుల ధ్రువీకరణ పత్రం, నామినీ ఆధార్కార్డు జిరాక్స్లను సేకరిస్తున్నారు. ఈ నెల చివర గొర్రెలు పంపిణీ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ చివరి నాటికి వందశాతం పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 42వేల మంది సభ్యులు
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాల్లో 384 గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలున్నాయి. వీటిలో 42వేలు మంది సభ్యులున్నారు. ఇందులో భాగంగా గొర్రెల పెంపకందారుల కోసం సబ్సిడీ గొర్రెల పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. రెండు విడుతల్లో సబ్సిడీ గొర్రెలు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు గ్రామాల వారీగా లబ్ధిదారులను గుర్తించారు. 50శాతం మందితో ఏ లిస్టు, మరో 50శాతం మందితో బీ లిస్టు తయారు చేశారు. డ్రా పద్ధతి ద్వారా ఇప్పటికే ఏ లిస్టులో 12వేల మందికి గొర్రెలను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికీ 21 గొర్రెలతో కూడిన రూ.1.25లక్షల యూనిట్ను పంపిణీ చేసింది. లబ్ధిదారు తన వాటాధనం కింద రూ.31,250 డీడీ రూపంలో చెల్లించగా ప్రభుత్వం 75శాతం సబ్సిడీగా రూ.93,750 ఇచ్చింది. రెండో విడుత గొర్రెల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. బీ లిస్ట్లోని గొర్రెల పెంపకం లబ్ధిదారులు తమ వాటాధనాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. దీన్ని నేరుగా కలెక్టర్ పేర ఉన్న బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తున్నారు. దీంతో వాటాధనాన్ని ఇతరులు కాకుండా స్వయంగా లబ్ధిదారుడే చెల్లించాడనేది స్పష్టం అవుతుంది. రెండో విడుతలో 30వేల మందికి గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉంది. ధరలు పెరిగినందున ఒక్కో లబ్ధిదారుకు అందజేసే 21 గొర్రెల యూనిట్ విలువను ప్రభుత్వం రూ.1.25లక్షల నుంచి రూ.1.75లక్షలకు పెంచింది. ఇందులో లబ్ధిదారుడు తన వాటాధనం కింద రూ.43,750 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం రూ.1,31, 250 సబ్సిడీ అందజేయనుంది. కాగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 275 మంది తమ వాటాధనాన్ని బ్యాంకు ఖాతా నుంచి కలెక్టర్ ఖాతాకు పంపారు. కొద్ది రోజుల్లో ప్రత్యేక బృందాల అధికారులు వాటాధనం చెల్లించిన వారికి సబ్సిడీ గొర్రెలను కొనుగోలు చేయనున్నారు. గొర్రెలు కొనుగోలు చేసినప్పటి నుండి వాటిని లబ్ధిదారుడికి అందజేసేంతా వరకు ఫోటోలు తీసుకుని యాప్లో అప్లోడ్ చేస్తారు.
ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు
సబ్సిడీ గొర్రెలు కొనుగోలు, పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. పశుసంవర్ధక శాఖ అధికారులు కాకుండా వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు సబ్సిడీ గొర్రెల కొనుగోలు, రవాణా, పంపిణీని మానిటరింగ్ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా ఇందుకోసం కలెక్టర్ ప్రత్యేకంగా 6 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి అధికారుల్లో ఒక్కొక్కరూ ఒక్కో టీం లీడర్గా వ్యవహరిస్తారు. ఈ టీముల్లో మండల స్థాయిలో పంచాయతీ అధికారులు ఉంటారు. ఈ టీంలు గొర్రెలను కొనుగోలు చేసి గ్రామాలకు చేర్చడం, లబ్ధిదారులకు అందేవరకు బాధ్యత తీసుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండో విడుత సబ్సిడీ గొర్రెల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
30వేల మందికి పంపిణీ చేస్తాం
రెండో విడుతలో 30వేల మందికి సబ్సిడీ గొర్రెలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రామాల వారీగా గొర్రెల పెంపకందారుల సంఘాలతో సమావేశాలు నిర్వహించడం జరిగింది. లబ్ధిదారుడికి సంబంధించి ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా, కుల ధ్రువీకరణ పత్రం, నామినీ ఆధార్కార్డు సేకరిస్తున్నాం. గతంలో మాదిరిగా డీడీ రూపంలో కాకుండా లబ్ధిదారుడి వాటాధనం కలెక్టర్ పేరున ఉన్న బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో 275 మంది తమ వాటాధనాన్ని చెల్లించారు. త్వరలో గొర్రెల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. పర్యవేక్షణకు ఆరు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా రెండో విడుత గొర్రెల పంపిణీ చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం.
– అంజిలప్ప, పశుసంవర్ధక శాఖ అధికారి, రంగారెడ్డిజిల్లా