గురుకుల విద్యాలయాలు చదువుకు నిలయాలుగా వెలుగొందుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. ప్రతి నిరుపేద విద్యార్థికీ నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వ విద్యలో అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. పెద్ద ఎత్తున గురుకులాలను నెలకొల్పి పేద విద్యార్థులకు మేలు చేస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు జిల్లాలో కేవలం 21 గురుకులాలు ఉండగా.. స్వరాష్ట్రంలో కొత్తగా 59 గురుకులాలు ఏర్పాటయ్యాయి.
ఇందులోని విద్యార్థులకు సకల వసతులు కల్పించడంతోపాటు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 80 గురుకులాల్లో 20,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.25లక్షలను ప్రభుత్వం ఖర్చుచేస్తున్నది. ఇక్కడ విద్యాబోధనే కాకుండా క్రీడలు, యోగా, ధాన్యం వంటి వాటిల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. దీంతో గురుకులాల విద్యార్థులు పోటీ పరీక్షల్లోనూ రాణించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. పాఠశాల విద్యతోపాటు ఇంటర్, డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చి బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను చేరువ చేసింది.
-రంగారెడ్డి, నవంబర్ 6(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో విద్యారంగం ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నది. తొమ్మిదేండ్లలో ఊహించని విధంగా విద్యాభివృద్ధిలో పురోగతిని సాధించింది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వ విద్యలో అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఓ పక్క ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూనే.. మరోపక్క సంక్షేమ శాఖల వారీగా కొత్తగా గురుకులాలను నెలకొల్పారు. జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం 21 గురుకులాలు మాత్రమే ఉండగా.. స్వరాష్ట్రంలో కొత్తగా 59 గురుకులాలు ఏర్పాటయ్యాయి.
మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో రెసిడెన్షియల్ లా కాలేజీనీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో విద్యార్థిపై రూ.1.30 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. పేద విద్యార్థులకు సకల వసతులతోపాటు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు. క్రీడలు, యోగా, ధ్యానం వంటి వాటిల్లోనూ తర్ఫీదునిస్తుండడంతో గురుకులాల్లోని విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత ఉద్యోగాల్లోనూ స్థిరపడుతున్నారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ గురుకులాలు విప్లవాన్ని సృష్టిస్తున్నాయి.
పేదింటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. కార్పొరేట్ స్థాయి హంగులతో ఒక్కో గురుకులాలన్నీ రూ.1.50కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసింది. ఈ విద్యాసంస్థలు పేద వర్గాలకు వరంగా మారాయి. నాణ్యమైన బోధన, అద్భుతమైన వసతులు, క్రీడలతోపాటు వివిధ అంశాల్లో ఉత్తమ శిక్షణకు గురుకులాలు కేరాఫ్ అడ్రస్గా మారాయి. చదువుతోనే బడుగుల బతుకులు మారుతాయని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల స్థాపన ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలో రంగారెడ్డి జిల్లాలో 21 మాత్రమే గురుకులాలు ఉండేవి. వీటిల్లో 7,360 మంది విద్యార్థులు మాత్రమే చదువుకునేవారు.
సరైన వసతులు లేక, నాణ్యమైన భోజనం అందక విద్యార్థులు అప్పట్లో సతమతమయ్యారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 26 సోషల్ వెల్ఫేర్, 9 మైనార్టీ వెల్ఫేర్, 7 ట్రైబల్ వెల్ఫేర్, 17 బీసీ వెల్ఫేర్ గురుకులాలను అందుబాటులోకి తెచ్చారు. బాలికల కోసం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ప్రస్తుతం 20,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యతోపాటు ఇంటర్, డిగ్రీ కళాశాలలు సైతం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా బడుగు వర్గాలకు ప్రభుత్వం ఉన్నత విద్యను చేరువ చేసింది. పిల్లలను చదివించడం తల్లిదండ్రులకు నేడు తలకు మించిన భారం కాగా..సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి ఆ భారాన్ని తీర్చారు.
గురుకులాల్లో చదువుకుంటున్న ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి రూ.1.30 లక్షలను ఖర్చు చేస్తున్నది. ప్రతి విద్యార్థికీ ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన నిర్ణీత మెనూ ప్రకారం ప్రతి రోజూ ఆహారం అందిస్తున్నారు. సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో నెయ్యితోపాటు పచ్చడి అందిస్తున్నారు. రోజూ గుడ్డు, పండుతోపాటు ప్రతి నెలా నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్తో కూడిన ఆహారం అందిస్తున్నారు. కాస్మోటిక్ చార్జీల కింద బాలురకు నెలకు రూ.115, బాలికలకు రూ.125 చొప్పున చెల్లిస్తున్నారు. మూడు జతల ఏకరూప దుస్తులు, ఒక కార్పెట్, ఒక బెడ్షీట్, రెండు జతల బూట్లు, సాక్సులను ప్రతి ఒక్కరికీ అందిస్తున్నారు.
ఉచితంగా పాఠ్యపుస్తకాలు, కావాల్సిన వారికి తరగతులను బట్టి నోట్ బుక్స్ సైతం ఇస్తున్నారు. పిల్లలను చదివించడం ఒకప్పుడు తల్లిదండ్రులకు తలకు మించిన భారం కాగా గురుకులాల ఏర్పాటుతో ఆ వ్యయ ప్రయాసలు తప్పాయి. విద్యార్థుల భవిష్యత్తుకు చుక్కానిలా నిలుస్తున్న గురుకులాల్లో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లోనూ సంతోషం వ్యక్తమవుతున్నది. అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలోనూ గురుకులాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడాన్ని ఆయా వర్గాలు స్వాగతిస్తున్నాయి.
దేశంలోనే అధిక గురుకులాలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన అందుతున్నది. ఒకప్పుడు పిల్లలను చదివించాలంటే అప్పులు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు గురుకులాల్లో ఉచితంగా విద్య అందుతున్నది. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. గురుకులాల్లో చదివినవారు ఉన్నత ఉద్యోగాలను సాధించారు. ఇలాంటి ప్రభుత్వమే మళ్లీ రావాలి.
– మూడవత్ కృష్ణవేణి, ఆమనగల్లు
మా పాపను వికారాబాద్ కొత్తగడి బాలికల గురుకుల పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించాం. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నది. ఇంగ్లిష్ మీడియం విద్యతో పాటు, భోజనం, తదితర వసతులు బాగున్నాయి. సన్నబియ్యంతో పౌష్టికాహారం, దుస్తులు, పాఠ్యపుస్తకాలు, షూలు, నోట్ పుస్తకాలు సైతం అందిస్తున్నారు. పేదల కోసం గురుకులాలను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– నాగారం మాణయ్య, జైదుపల్లి, వికారాబాద్
గురుకులాలు పేద విద్యార్థుల ఆశల సౌధాలు. అందులో కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో పిల్లలు పైసా ఖర్చు లేకుండా చదువుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గింది. విద్యకు ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– పంజుగుల గోపాల్, యాలాల
మాది కర్ణాటక రాష్ట్రం తోన్సెల్లి మండలం శకాపూర్ గ్రామం. పిల్లలను బాగా చదివించాలనుకొన్నా. తెలంగాణ గురుకులంలో మా అబ్బాయిని చదివిస్తున్నా. ఈ రాష్ట్రంలో విద్య చాలా బాగున్నది. పేదలకు వరంగా గురుకులాలను అందించిన సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా.
– తల్వార్ శ్రీదేవి, యాలాల
గురుకుల పాఠశాలలు నిరుపేదలకు వరం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతోపాటు సకల వసతులు కల్పిస్తున్నది. అగ్ర వర్ణాల పేదలకు సైతం గురుకులాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరం. విద్యార్థుల మేలు కోసం మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రతి బడినీ తీర్చిదిద్దడం అభినందనీయం. ఇలాంటి ముఖ్యమంత్రి మళ్లీ వస్తేనే రాష్ట్రం బాగుపడుతది.
– బాచిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, (కడ్తాల్)
గురుకులాల ఏర్పాటుతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడుతున్నాయి. ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులను ఆదుకుంటున్నారు. మా ఇద్దరు కుమారులు ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్కు విద్యార్థుల తల్లిదండ్రులు ఎల్లప్పుడు రుణపడి ఉంటారు.
– బ్యాగరి సుశీల, దేవునిఎర్రవల్లి గ్రామం (చేవెళ్ల రూరల్)
తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఉచిత విద్యను అందిస్తున్నది. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థులు లేక వెలవెలబోయాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగం అభివృద్ధి చెందింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ గురుకుల పాఠశాలలతో పాటు మాడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. బుక్స్, యూనిఫామ్ను ఉచితంగా అందిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు వస్తున్నాయి. – నరేందర్ గౌడ్, చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి, మల్కాపూర్ గ్రామం(చేవెళ్లటౌన్)
గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతున్నది. నాకు ఐదుగురు ఆడపిల్లలు. ఇద్దరి వివాహాలు జరిగాయి. మూడో అమ్మాయి హైదరాబాద్లో నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నది. నాలుగో కూతురు దౌల్తాబాద్లోని కేజీబీవీ పాఠశాలలో ఇంటర్ చదువుతున్నది. చిన్న పాప ప్రస్తుతం మెయినాబాద్లోని గురుకులంలో 8వ తరగతి చదువుతున్నది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– నర్సింలు, దేవర్ఫసల్వాద్(కొడంగల్)