వికారాబాద్ : కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రామయ్యగూడ పీహెచ్సీ డాక్టర్ వినోద్రెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్థులకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయాలని నిబంధనలు ఉన్నాయన్నారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించి ఉచితంగా అందిస్తున్న వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కొవిడ్, ఓమిక్రాన్ వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సురేశ్వరస్వామి, అధ్యాపకులు బుచ్చయ్య, బందయ్య, శాంరాజ్, కవిత, వెంకన్న, నర్సింలు, వంశీకృష్ణ, ప్రవీణ్, మహేష్, నరేష్, వైద్య సిబ్బంది ఉన్నారు.