షాద్నగర్ రూరల్, జూలై 14 : రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ దేశంలో ఎక్కడ లేని విధంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. వినూత్న పద్ధతులతో సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ఉమ్మడి పాలనలో పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి అవస్థలు పడ్డ రైతన్నలకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. తెలంగాణ సర్కార్ ఏర్పడ్డాకే రైతన్నల దశదిశ మారింది.
ఒకే రకం పంటలను వేయకుండా పంట మార్పిడి చేస్తే లాభాలను పొందచ్చని వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొద్ది పాటి పొలంలో కొంత భాగంలో కూరగాయలను సాగు చేసిన అన్నదాతలు లాభాలను ఆర్జిస్తున్నారు. ఫరూఖ్నగర్ మండలంలో కూరగాయల పంటల సాగు విస్తీర్ణం క్రమేణ పెరుగుతున్నది. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటున్న తరుణంలో రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. మండలంలోని 48 గ్రామపంచాయతీల్లోని 24,826 ఎకరాల్లో సూమారు 500 ఎకరాల్లో కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. టమాట, బెండకాయల సాగు చేసిన అన్నదాతలు లాభాలను ఆర్జిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం టమాటాకు మంచి గిరాకీ ఉన్నది. టమాట పంట చేతికొచ్చిన రైతులు అధిక లాభాలను పొందుతున్నారు.