తెలంగాణలో ఇంటింటికీ నీళ్లు అందుతుంటే పక్క రాష్ర్టాల్లో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపాలిటీలో రూ. 5.50కోట్లతో నిర్మించిన 50పడకల ఆసుపత్రి నూతన భవనాన్ని మంత్రి మహేందర్రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా రేవంత్రెడ్డి కొడంగల్కు చేసిందేమీలేదన్నారు.
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నదన్నారు. అత్యధిక నిధులతో ప్రగతి పనులు చేపట్టడంతో నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయన్నారు. వ్యవసాయానికి 3గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని రేవంత్రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా..? 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్న బీఆర్ఎస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇస్తున్న ఎన్నికల హామీలు .. ఆ పార్టీ పాలిత ప్రాంతాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అక్కడ అమలు చేయని పథకాలను ఇక్కడ అమలు చేస్తామంటే నమ్మడం ఎలా అన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు.
-కొడంగల్, అక్టోబర్ 4
కొడంగల్, అక్టోబర్ 4 : బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు కావడం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంతి హరీశ్రావు అన్నారు. నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో రూ. 5కోట్ల 50లక్షలతో నిర్మించిన 50 పడకల నూతన దవాఖాన భవనాన్ని మంత్రి మహేందర్రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. రూ.30లక్షలతో అంబేద్కర్ భవనం, రూ.30లక్షలతో ముదిరాజ్ భవనం, రూ.30లక్షలతో యాదవ భవన నిర్మాణాలకు, మున్సిపల్ కేంద్రంలో రూ.10కోట్ల (టీయూఎఫ్ఐడీసీ) నిధులతో పలు అభివృద్ధి పనులకూ మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కొడంగల్ అభివృద్ధిని పట్టించుకోకపోవడం వల్ల రేవంత్రెడ్డిని ప్రజలు ఓడించడం జరిగిందన్నారు.
పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు కొడంగల్ అభివృద్ధి పథంలో దూకెళ్తున్నట్లు పేర్కొన్నారు. 2018లో ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ప్రత్యేక దృస్టితో పెద్ద మొత్తంలో నిధుల మంజూరుతో అధిక మొత్తంలోనే అభివృద్ధి పనులు సాధ్యపడినట్లు తెలిపారు. కొడంగల్, కోస్గి మున్సిపాలిటీ కేంద్రాల్లో అన్నింటా నాణ్యమైన వైద్య సేవలను అందుకునే 50 పడకల దవాఖాన నూతన భవనాలు, మద్దూర్ మండలంలో 30 పడకల దవాఖాన రూపుదిద్దుకొన్నట్లు తెలిపారు. గతంలో సుదూర హైదరాబాద్ వంటి పట్టణాలకు పరుగులు పెట్టాల్సి వచ్చేదని, నేడు స్థానికంగానే కార్పొరేట్ తరహా వైద్య సేవలు చేరువైనట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో నేను రాను బిడ్దో సర్కారు దవాఖానకు అనే వారని, నేడు కేసీఆర్ పాలనలో పొదాం పదా సర్కారు దవాఖానకు అంటూ జనం వెళ్తున్నారన్నారు.
పేదల ఆరోగ్యాలకు ప్రభుత్వం పెద్ద పీట వేసి ప్రభుత్వ దవాఖానాలను అన్నింటా సౌకర్యాలు, హంగులతో నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రైవేటు వైద్య సేవలు చాలా ఖర్చుతో కూడుకొన్నాయని, సర్కారు దవాఖానలు పైసా ఖర్చు లేకుండా కేసీఆర్ కిట్ వంటి సదుపాయాలను అందుకునే వసతులు ఏర్పడినట్లు తెలిపారు. జిల్లాకో వైద్య కళాశాలతో వైద్య విద్యలో ప్రభంజనాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. నారాయణపేట జిల్లాలో రూ.160కోట్లతో వైద్య కళాశాల మంజూరైందన్నారు. కార్పొరేట్కు దీటుగా గురుకులాలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకు పైగా వెచ్చించి నాణ్యమైన విద్యాబోధనను అందుతుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, చత్తీస్ఘడ్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లో ప్రజా సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదన్నారు. అక్కడ అమలు చేయని పథకాలను తెలంగాణలో అమలు చేస్తామంటే నమ్మడం ఏలా అన్నారు. కర్ణాటకలో రూ.600 పింఛన్ మాత్రమే అమలులో ఉన్నదని, తెలంగాణలో రూ. 2016 అందుకొని ఆత్మాభిమానంతో జీవిస్తున్నట్లు గుర్తు చేశారు. కర్ణాటకలో ఆడపిల్లల పెండ్లికి ప్రభుత్వం పైసా ఇవ్వదని, మూడు రోజులకోసారి నల్లా నీళ్లు వస్తాయన్నారు. ఎన్నికలు వస్తుండడంతో కాంగ్రెస్ నాయకులు అమలుకు సాధ్యం కాని పథకాల హామీలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. గతంలోని పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలు చేయాలనే సోయి ఎందుకు రాలేదన్నారు. కొడంగల్లో రెండు పర్యాయాలు రేవంత్రెడ్డిని ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించుకుంటే ఏ ఒక్కనాడు కొడంగల్ అభివృద్ధికి పాటుపడలేదని, కనీసం అభివృద్ధికి నిధులు కావాలని ఏ ఒక్క మంత్రిని కలవలేదన్నారు.
అటువంటి వ్యక్తికి ఓటు వేస్తే కైలాస పటంలో పెద్ద పాము మింగినట్లుగా కొడంగల్ అభివృద్ధి కుంటు పడిపోతుందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రభంజనం సృష్టిస్తుందని, అభివృద్ధికి అండగా నిలిచే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మన నియోజకవర్గాన్ని, రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకొందామని పిలుపునిచ్చారు. గడిచిన 9 సంవత్సరాల్లో రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా బీఆర్ఎస్తో పోటీ పడే సత్తా లేదని సవాల్ విసిరారు. మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నారని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అమ్మఒడి, గృహలక్ష్మి పథకం, న్యూట్రీషన్ కిట్, పెద్ద మొత్తంలో రుణాలు అందించడం జరుగుతుందన్నారు.
మహిళల విద్యాభివృద్ధికి గాను రాష్ట్రంలో 74 డెసిడెన్షియల్ కళాశాలలు, 600 జూనియర్ కళాశాలలు, మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 3వేల తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 46 గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకొని తండాను అభివృద్ధి చేసుకునే అధికారాన్ని గిరిజనులకే అప్పగించడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గతంలో ఏ పార్టీ ఏ నాయకుల ద్వారా అభివృద్ధి ఏవిధంగా జరిగింది. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేశారో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. అభివృద్ధికి అండగా నిలిస్తే.. జీవితాలు బంగారుమయంగా మారుతాయని, మాయమాటలు చెప్పే నాయకులతో మోసపోవద్దని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, నారాయణపేట జడ్పీ చైర్మన్ వనజమ్మ, టీఎస్ ఎఐడీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోల్ల శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ శ్యాసం రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ శిరీష తదితరులు పాల్గొన్నారు.
అప్పట్లో తాగునీటి గోస చెప్పుకోలేనిదని, ఖాళీ బిందెలతో సుదూర ప్రాంతాలకు వెళ్లి మహిళలు నీటిని తెచ్చుకునే దౌర్భాగ్యం ఉండేదని మంత్రి హరీశ్రావు అన్నారు. నేడు మిషన్ భగీరథ పథకంతో స్వచ్ఛమైన కృష్ణా జలాలు ఇంటికి సరఫరా అవుతున్నాయన్నారు. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ఎర్రటి ఎండలో ధర్నాలు చేసే వారని, నేడు నీడ పట్టున పుష్కలంగా నీటిని అందుకొంటున్నారన్నారు. ఇంటికి తాగునీటిని ముఖ్యమంత్రి ఏవిధంగా అందించారో రైతన్న కల నీటి కష్టాలను తీర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కృష్ణా జలాలు నార్లపూర్ రిజర్వాయర్కు చేరుకున్నాయని, త్వరలో పంటపొలాల్లో కృష్ణ జలాలు అందుకునే సదుపాయం దగ్గర్లోనే ఉన్నదన్నారు. సాగునీటిని అందించేందుకు గాను కాల్వల పనులు జరుగుతున్నాయని, ‘పాలమూరు-రంగారెడ్డి’తో వలసలు అంతరించి ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వలస వచ్చే శుభగడియలు రానున్నాయన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్తు సరఫరాతో రైతన్నల కష్టాలు తీరాయన్నారు. వ్యవసాయానికి 3గంటల విద్యుత్తు సరిపోతుందని, వ్యవసాయం తెలియని దద్దమ్మ రేవంత్రెడ్డి తెలుపడం జరిగిందన్నారు. 3గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా ? 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే కేసీఆర్ ప్రభుత్వం కావాలో రైతన్నలతో పాటు ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడికి రుణం తీర్చుకొంటామని పేర్కొన్నారు.
గతంతో రెండు పర్యాయాలు కొడంగల్ ప్రజలు రేవంత్ను గెలిపించుకొంటే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని, 2018 ఎన్నికల్లో ప్రజలు ఓడించి రేవంత్ను తరిమి కొట్టారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని గమనించిన రేవంత్, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డిని ఆశ్రయించినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో గుర్నాథ్రెడ్డి కోటలను కూల్చుతా అని శపథం చేసిన వ్యక్తి నేడు ఆయన కోటకు వెళ్లి ఆశ్రయించినట్లు ఆరోపించారు. ఎంత మంది రేవంత్రెడ్డిలు, గుర్నాథ్రెడ్డిలు వచ్చినా కొడంగల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదని, మళ్లీ కొడంగల్లో ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన ఐదేండ్లలో కొడంగల్కు వందల కోట్ల నిధులు మంజూరయ్యాయని, గ్రామ గ్రామానికి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, రోడ్డు ఎరుగని ఎన్నో గ్రామ, తండాలకు నేడు బీటీ రోడ్లు వేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో రైతుబంధు ఒక్క సీజన్కు రూ.100కోట్లు మంజూరయ్యాయన్నారు. 1647 మందికి రైతుబీమా పథకం ద్వారా రూ.82కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. 38వేల పింఛన్ లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.9కోట్ల 50లక్షలు అందుతున్నాయన్నారు. దేవాలయాలు, మసీదు, చర్చీల అభివృద్ధికి గాను ప్రత్యేకంగా నిధులు మంజూరవుతున్నట్లు వివరించారు. కానీ అభివృద్ధిని నేనే చేశానని రేవంత్ గొప్పలు చెప్పుకొని ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు.
గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచి సంక్షేమం, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా బీఆర్ఎస్ నిలిచిందని సమాచార పౌర సంబంధాలు, భూగర్భ జల వనరులు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలు తెలంగాణ అమలవుతున్నాయన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఆలోచించి నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతూ వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా చేసేందుకు కంకణం కట్టుకొన్నట్లు తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి పల్లె, గ్రామ, తండాలను సందర్శించినట్లు తెలిపారు. అప్పట్లో గ్రామ, తండాల్లోని రోడ్లుపై, వీధుల్లో నడిచే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఎన్నికల అనంతరం పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యే కాగా, వెనుబడిన కొడంగల్ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వందల కోట్ల నిధుల మంజూరుతో అభివృద్ధి పనుల చేపట్టారన్నారు. దీంతో నేడు గ్రామ, తండాలతోపాటు పట్టణ ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు. రోడ్డు ఎరుగని ఎన్నో గ్రామ, తండాలకు బీటీ రోడ్లను వేయించామన్నారు. గ్రామ, తండాల వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో స్వచ్ఛ పల్లెలుగా మారాయని పేర్కొన్నారు.
2018 ఎన్నికల్లో కొడంగల్ ఎన్నికల ఇన్చార్జిగా ఉండి ప్రతి గ్రామాన్ని, తండాలను సందర్శించడం జరిగిందని, ఆనాటి ప్రజల గోస అరిగోసగా ఉండేదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. కోస్గిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం రాకముందు సరైన సౌకర్యాలు అందుబాటులో లేక, ప్రజల కష్టాలను, సమస్యలను పరిష్కరించే సరైన నాయకుడు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సమస్యలను అప్పటి నాయకులకు వివరించినా పట్టించుకునే నాథుడు లేదన్నారు. కాబట్టే కొడంగల్ నియోజకవర్గం అన్నింటా వెనుబడి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిందన్నారు. 2018 ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ప్రత్యేక దృష్టితో కొడంగల్ నియోజకవర్గం నేడు అభివృద్ధిని సాధించిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు సకల సౌకర్యాలు సమకూరాయన్నారు. ఆధునిక దవాఖానలు, బస్డిపో, గ్రామ గ్రామానికి రోడ్లు వేయగా, రవాణా సౌకర్యం మెరుగుపడిందన్నారు.