రంగారెడ్డి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి ఎద్దడి నివారణ చర్యలతోపాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సీఎంఆర్ లక్ష్యం తదితర వాటిపై దిశా నిర్దేశం చేశారు.
రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్ రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ శశాంక వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 16 పురపాలక సంఘాలు, 558 గ్రామపంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని, జిల్లాలో 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉందని, ధాన్యం కొనుగోళ్లకై ఐకేపీ ఆధ్వర్యంలో 3, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 27, డీసీఎంసీ ఆధ్వర్యంలో 9 కలిపి మొత్తం 39 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలతోపాటు ప్యాడి క్లీనర్, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (డీఎస్వో) మనోహర్ రాథోడ్, డీసీఎస్వో విజయలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వికారాబాద్ : గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఆమె నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) రాహుల్శర్మ, (రెవెన్యూ) లింగ్యానాయక్ , సంబంధిత అధికారులతో కలిసి వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి జిల్లాలో 4 పురపాలక సంఘాలు, 565 గ్రామపంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఐకేపీ ఆధ్వర్యంలో 122 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్, టార్పలిన్లు, గన్నీబ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఎస్వో రాజేశ్వర్, డీఎం సుగుణాబాయి, అడిషనల్ డీఆర్డీఏసరోజ, మిషన్ భగీరథ అధికారులు బాబు శ్రీనివాస్, చెల్మారెడ్డి, డీపీవో జయసుధ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.