రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ): వేసవి, వానకాలాల్లో పిల్లలకు డయేరియా సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయని అందువల్ల ఆ వ్యాధి నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన డయేరియా నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై జిల్లాలోని పీహెచ్సీ వైద్యాధికారులు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ఆరోగ్య సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 25 నుంచి జూన్ 8వ తేదీ వరకు డయేరియా నివారణ పక్షంగా జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. డయేరియాకు చికిత్స ఓఆర్ఎస్ జింక్ మాత్రలేనని పేర్కొన్నారు.
ఇంటింటి సర్వే చేపట్టాలి..
పది రోజులపాటు ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేసి ఐదేండ్ల లోపు పిల్లలున్న ప్రతి ఇంటికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని సూచించారు. ఎవరైనా డయేరియాతో బాధపడితే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లతోపాటు జింక్ మాత్రలూ అందజేయాలన్నారు. వ్యాధి తీవ్రంగా ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తే వైద్యుడు చికిత్స అందిస్తారన్నారు. అనంతరం జిల్లా టీకాల అధికారిణి డాక్టర్ స్వర్ణకుమారి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో 1,36,000 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 75,000 జింక్ మాత్రలను అందుబాటులో ఉంచామని.. అవసరమైతే మరిన్ని పంపిణీ చేస్తామని తెలిపారు.