షాబాద్, ఫిబ్రవరి 6 : పరిశుభ్ర గ్రామాలే లక్ష్యంగా వారం రోజుల పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ఇటీవల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గ్రామ సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీ కాలం ఫిబ్రవరి 1వ తేదీన ముగియడంతో వారి స్థానంలో ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. వీరంతా 2వ తేదీ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య లోపం, తాగునీటి సమస్య, పైపులైన్ లీకేజీలను సరిచేయడం తదితర పనులను చేయనున్నారు. వికారాబాద్ జిల్లాలోని 566 గ్రామాల్లో నేటి నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 559 గ్రామ పంచాయతీలు..
జిల్లావ్యాప్తంగా 559 గ్రామ పంచాయతీలకు గాను 252 మంది ప్రత్యేకాధికారులను కేటాయించడం జరిగింది. చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు (కల్వకుర్తి), మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో, మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి జీపీల రూపురేఖలు మార్చింది. సర్పంచ్ల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రస్తుతం సర్పంచ్ల పదవీకాలం పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులతో శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నది.
అందుబాటులో ఉన్న నిధులతోనే..
పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించలేదు. గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు ఉన్న నిధులతోనే పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో మహిళా సంఘాలు, యువతతో పాటు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
స్పెషల్ డ్రైవ్నువిజయవంతం చేయాలి..
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో నేటి నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అన్ని గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చాం. గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకోవాలి. అందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
– తరుణ్కుమార్, వికారాబాద్ డీపీవో
రోజువారీగా చేపట్టే పనులు 7వ తేదీ బుధవారం..
గ్రామసభ నిర్వహించాలి. గ్రామంలోని మహిళా సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, అధికారులను ఆహ్వానించి ప్రత్యేకాధికారుల పాలనను వివరించాలి. గ్రామంలో పర్యటించి తాగునీరు, పారిశుధ్యం, ఇతర సమస్యలను గుర్తించి, పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలి. రోడ్లను శుభ్రం చేయడంతో పాటు గుంతలను పూడ్చి వేయాలి. రోడ్డు పక్కన నాటిన మొక్కల మధ్య పెరిగిన కలుపు మొక్కలను తొలగించాలి.
8వ తేదీ గురువారం..
రోడ్లన్నింటినీ శుభ్రం చేసి గుంతలను పూడ్చాలి. జాతీయ రహదారులపై ఉన్న మట్టి దిబ్బలు, చెత్త కుప్పలను తొల గించాలి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా మట్టితో పూడ్చి వేయాలి. ప్రజలకు తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కల్పించాలి. రహదారి ప్లాంటేషన్ మధ్య కలుపు మొక్కలను తొలగించాలి. పడి పోయిన చెట్లను సరి చేయాలి. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త వాటిని నాటాలి.
9వ తేదీ శుక్రవారం..
గ్రామంలోని అన్ని రోడ్లను శుభ్రం చేయాలి. డెంగీ వ్యాధికి కారణమయ్యే దోమల వృద్ధిని అరికట్టడానికి ప్రతి శుక్ర వారం డ్రై డేగా ప్రకటించాలి. పంచాయతీ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి డ్రై డే వల్ల కలిగే ఉపయోగాలను వివరించాలి. నీటి తొట్లు, పాత టైర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, పాత కూలర్లు మొదలగు వాటిలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలి.నర్సరీలను ప్రత్యేకాధికారులు విధిగా సందర్శించాలి.
10వ తేదీ శనివారం..
రోడ్లకు ఇరువైపులా ఉన్న కలుపు మొక్కలు, గడ్డి, ముళ్ల పొదలను తొలగించాలి. అంగన్వాడీ కేంద్రాలు, పంచా యతీ భవనాలు, వాటర్ ట్యాంకులు, ప్రభుత్వ దవాఖా నలు, భవనాలు, ఖాళీ ప్లాట్ల వద్ద ఉన్న చెత్త, కలుపు మొక్కలను తొలగించాలి.
11వ తేదీ ఆదివారం..
తాగునీటికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలి. తాగునీటి ట్యాంకును శుభ్రం చేయాలి. పైపులైన్ లీకేజీ లను గుర్తించి మరమ్మతు చేయాలి. గ్రామంలోని ప్రతి తాగునీటి ట్యాంకునూ ప్రతినెలా 1, 11, 21వ తేదీల్లో తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ట్యాంకులో క్లోరి నేషన్ చేయాలి. తాగునీటి వృథాను అరికట్టడానికి ప్రతి ఇంటికీ ఆన్ ఆఫ్ బిగించాలి. బహిరంగ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలి. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయాలి. దోమల మందు పిచికారీ చేయాలి. పని చేయని బోర్లు, పాత బావులను పూడ్చి వేయాలి. వ్యక్తిగత మరుగుదొడ్లను విని యోగించేలా చర్యలు తీసుకోవాలి. గ్రే వాటర్ను ఇంకుడు గుంతల్లోకి, కిచెన్ గార్డెన్లకు మళ్లించేలా అవగాహన కల్పించాలి. కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. ఒక గుంత ఉన్న మరుగుదొడ్డికి మరొక గుంతను తవ్వే విధంగా చూడాలి.
12వ తేదీ సోమవారం..
మురికి కాల్వలను శుభ్రం చేయాలి. తరుచుగా చెత్త వేసే ప్రాంతాలను శుభ్రం చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి.
13వ తేదీ మంగళవారం..
పాఠశాల విద్యార్థులకు, దేవాలయాల దగ్గర గల షాపులు, హోటళ్లలో వారికి ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పిం చాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే జరిమానా విధిస్తా మని హెచ్చరించాలి. ప్లాస్టిక్ రహితంపై చర్చించాలి.
14వ తేదీ బుధవారం..
పైప్లైన్ లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయాలి. లీకే జీల వల్ల తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకో వాలి. గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చేసి వంద శాతం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.
15వ తేదీ గురువారం..
గ్రామసభ సర్పంచ్ సామాజిక రుగ్మతలైన మద్యపానం, ధూమపానం, గుట్కా, తంబాకు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత నైపుణ్యాభివృద్ధికి ఇస్తున్న శిక్ష ణలను వివరించి ఉపాధికి మార్గనిర్దేశం చేయాలి. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మారడానికి ర్యాలీలు నిర్వహించాలి. బాగా పని చేసిన సిబ్బంది, యువజన, మహిళా సంఘాలు, పంచాయతీ కార్యదర్శులకు సన్మానం చేయాలి.