ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 4 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రైతులతో పాటు పశువులను కూడా వేసవిలో సంరక్షించేందుకు పశుగ్రాసం ఇబ్బందులు తలెత్తకుండా సబ్సిడీపై గడ్డి విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. పశుగ్రాసం కోసం వేసవిలో రైతులకు ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రతి ఏటా వేసవిలో మూగజీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి పశుగ్రాసాన్ని కొనుగోలు చేయలేని రైతుల ఇబ్బందులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. 75 శాతం రాయితీపై గడ్డివిత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నది. జిల్లాలో ఉన్న మూగజీవాలు ఆవులు 2.40లక్షలు, గేదెలు 1.30లక్షల పశువులు ఉన్నాయి. రాయితీపై ఇప్పటి వరకు 250 టన్నుల పశుగ్రాసం విత్తనాలను సరఫరా చేశామని, ఇంకా రైతుల అవసరం మేరకు మరిన్ని విత్తనాలను ఆయా పశుసంవర్ధకశాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి అంజిలప్ప తెలిపారు.
పశువైద్యశాలలో పశుగ్రాసం విత్తనాలు..
పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న గడ్డివిత్తనాలను జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లోని పశువైద్య కేంద్రాల్లో రైతులకు అందజేస్తున్నారు. ఇప్పటికే పశువైద్యాధికారుల ద్వారా రైతులకు ఇప్పటి వరకు 250 టన్నుల పశుగ్రాసం విత్తనాలు 75 శాతం రాయితీపై అందజేశారు. గడ్డివిత్తనాలు కావాల్సిన రైతులు సంబంధిత పశువైద్యశాఖలో వీటిని పొందవచ్చు. ఈ విషయంపై జిల్లాలోని రైతులకు పశుసంవర్ధకశాఖ తరఫున అవగాహన కూడా కల్పిస్తున్నారు. గడ్డివిత్తనాలు ఎలా చల్లాలి. నీటి తడులు ఏ మేరకు ఇవ్వాలి. ఏ దశలో గడ్డి కోయాలి. కోసిన గడ్డిని వృథా కాకుండా ఎలా వినియోగించాలి… అన్న అంశాలపై పశువైద్యశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నది.
గడ్డి విత్తనాలు అందజేస్తాం..
వేసవిలో పశుగ్రాసం కొరత రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలో పశువైద్యకేంద్రాల ద్వారా 75శాతం రాయితీపై 250టన్నుల పశుగ్రాసం విత్తనాలు సరఫరా చేశాం. పశుగ్రాసం విత్తనాలు అడిగిన ప్రతి ఒక్క రైతులకు రాయితీపై విత్తనాలు అందజేస్తున్నాం. అవసరమైన రైతులు స్థానిక పశువైద్యశాలల్లో విత్తనాలు తీసుకోవాలి.
– అంజిలప్ప, రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి