రంగారెడ్డి, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటరుగా తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు ఎన్నికల కమిషన్ మరోసారి అవకాశం కల్పిం చింది. గత నెలలోనే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టి ఓటు నమోదు, సవరణలకు అవకాశం కల్పించింది. రంగారెడ్డి జిల్లాలో 35,57,415 మంది, వికారాబాద్ జిల్లాలో 9,71,011 మంది ఓటర్లున్నట్లు ముసాయిదా జాబితాను విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలకు ఈనెల 22 వరకు అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 20, 21 తేదీల్లో కొత్తగా ఓటు నమోదు కోసం ఉమ్మడి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నది.
ఈ డ్రైవ్లో సంబంధిత ఫారాలను సమర్పించి నూతన ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడంతోపాటు, పేర్లు, చిరునామాలు తప్పుగా ఉన్న వారు సైతం సవరణకు దరఖాస్తులు ఇవ్వొచ్చు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులను స్వీకరించనున్నారు. డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను తొలగించి ఫిబ్రవరి 8న తుది జాబితాను ప్రకటిస్తారు. అయితే అర్హులు ceotelangana.in వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. పేరు, అడ్రస్ తదితర తప్పులేమైనా ఉంటే సంబంధిత పోలింగ్ కేంద్రానికెళ్లి తప్పులను సరిచేసుకోవాలి.
కాగా వికారాబాద్ జిల్లాలో కొత్తగా ఓటరు నమోదుకు అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్ప టివరకు 33,650 దరఖాస్తులు రాగా అందులో 1539 దరఖాస్తులను ఎన్నికల అధికారులు తిరస్కరిం చగా మరో 8512 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. 23,599 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. ఆమోదం పొందిన కొత్త దరఖాస్తుల్లో పరిగి నియోజకవర్గంలో 6,283 దరఖాస్తులు, వికారాబాద్ నియోజకవర్గంలో 2,142, తాండూరు నియోజకవర్గంలో 8,267, కొడంగల్ నియోజకవర్గంలో 6,907 దరఖాస్తులున్నాయి. అదేవిధంగా ఓటరు గుర్తింపు కార్డుల్లో మార్పులు, చేర్పులకు 3,093 , అడ్రస్ మార్పులకు 11,431 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఉన్న దృష్ట్యా కొత్తగా మరో 30 వేల మంది ఓటర్లుగా చేరనున్నారు.
వచ్చే ఎన్నికలకు తాజా ఓటరు జాబితా కీలకం కానుండగా ఎన్నికల సంఘం ఓటు నమోదుకు సదావకాశాన్ని కల్పించింది. త్వరలోనే లోక్సభ ఎన్నికలతో పాటు ఆ తర్వాత పంచాయతీ, ఎం పీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత ఓటు నమోదు కార్యక్రమంలో ఓటరుగా యువతీయువకులు నమోదు చేయించుకుంటే ఆయా ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఓటు నమోదుపై నిర్లక్ష్యం చేయడంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు. ఈ పరిస్థితి మళ్లీ రాకుండా ఉండేందుకు ప్రస్తుత ఓటరు నమోదు కార్యక్రమం మంచి అవకాశం కానున్నది.
అర్హులైన ప్రతి ఒక్కరూ నేడు, రేపు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని స ద్వినియోగం చేసుకోవాలి. ఓటు ప్రాధాన్యాన్ని వివరించి 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకునేందుకు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి అధికారులు కృషి చేయాలి. ఇందుకు రాజకీయ పార్టీలు సైతం సహకరించాలి.
-శశాంక, రంగారెడ్డి కలెక్టర్
జిల్లాలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ నేడు, రేపు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని ఓటరుగా తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. అవసరమైన వారు మార్పులు, చేర్పులు కూడా చేసుకోవచ్చు.
-నారాయణరెడ్డి, వికారాబాద్ కలెక్టర్