వికారాబాద్, జనవరి 3 : పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం బంట్వారంలో నిర్వహించిన ప్రజా పాలన, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభాపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు. వికారాబాద్ నియోజకవర్గాన్ని మూడు వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.
ప్రజాపాలన కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు అర్హులైన ప్రతిఒక్కరూ ఆరో తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో లేనివారికి తిరిగి నాలుగు నెలల తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశముంటుందని పేర్కొన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను అర్హులందరూ వినియోగించుకోవాలన్నారు.
లబ్ధిదారులకు నష్టం వాటిల్లకుండా గత ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను యథావిధిగా అందజేస్తున్నామని, భవిష్యత్తులో లక్షా116 రూపాయలతో పాటు తులం బంగారం లేదా లక్షా అరవై వేల రూపాయల చెక్కులను అందజేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయకుమారి, సర్పంచ్ లావణ్య, కోట్పల్లి జడ్పీటీసీ సంతోష, ఎంపీపీలు ప్రభాకర్, శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ పద్మ, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.