వికారాబాద్, ఫిబ్రవరి 1 : బాలకార్మికులను ఎవరైనా పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ‘ఆపరేషన్ స్మైల్’ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ బాలకార్మికుల గుర్తింపునకు జనవరి 1వ తేదీ నుంచి 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ స్మైల్లో భాగంగా 162 మంది బాలకార్మికులకు పని నుంచి విముక్తి కల్పించామన్నారు.
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బాలకార్మికులను గుర్తించామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేసి బాలబాలికలను కాపాడారన్నారు. మొత్తం 11 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 162 మంది బాలకార్మికుల్లో 150 మంది బాలురు, 12 మంది బాలికలు ఉన్నారన్నారు. ఇందులో 44 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లో ఎవరైనా బాలకార్మికులను గుర్తిస్తే సమాచారం అందించాలన్నారు. బాలబాలికలతో భిక్షాటన చేయించినా, కర్మాగారాలు ఇతర చోట్లలో పనుల్లో పెట్టుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాలకార్మికులు కనబడితే వెంటనే పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆపరేషన్ స్మైల్లో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీఎల్వో ( డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ )శ్రీనివాస్ రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు వెంకటేశం, బాలస్వామి, ఐటీసీటీ ఇన్స్పెక్టర్ రవికుమార్, డీఎస్బీ ఇన్స్పెక్టర్ డీవీపీ రాజు, ఎస్సైలు, చైల్డ్ డిపార్ట్మెంట్ అధికారులు నరేశ్ కుమార్, ఆంజనేయులు, షఫీ, చైల్డ్ లైన్ సిబ్బంది ఆనంద్, మహేశ్, లేబర్ డిపార్ట్మెంట్ సిబ్బంది వినాయక రావు, రాజేశ్ పాల్గొన్నారు.