మాతాశిశు సంరక్షణకు తెలంగాణ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారికి క్రమం తప్పకుండా పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నది. పాలు, గుడ్లు, కూరగాయలు, పప్పు, అన్నంతోపాటు చిన్నారులకు అదనంగా బాలామృతం అందిస్తున్నది. మరిన్ని మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారా సన్నబియ్యం భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల నుంచే దీనిని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. సర్కార్ నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 65078 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రయోజనం కలుగనున్నది. మాతాశిశు ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
బొంరాస్పేట, మే 8 : అంగన్వాడీ కేంద్రాల పరిధిలో చదివే చిన్నారులు, గర్భిణులు, బాలింతల శ్రేయస్సుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి దొడ్డు బియ్యంతో అందిస్తున్న భోజనం స్థానంలో సన్న బియ్యంతో భోజనం అందించాలని సర్కారు సంకల్పించింది. ఈ నెల నుంచే దీనిని అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీంతో వికారాబాద్ జిల్లాలో 65078 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వ నిర్ణయంపై గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హాజరు శాతం పెరుగుతుంది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు మధ్యాహ్నం పూట ప్రభుత్వం దొడ్డుబియ్యంతో భోజనం అందిస్తున్నారు. చాలా చోట్ల దొడ్డు బియ్యంతో వండిన అన్నం తినడానికి ఆసక్తి చూపడం లేదని గ్రహించిన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో కూడా సన్న బియ్యంతో భోజనం అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల కేంద్రాలకు లబ్ధిదారులు మరింత ఆకర్షితులై హాజరు శాతం పెరుగుతుందని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్యలక్ష్మి పథకం కింద భోజనం
అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద సెలవు రోజులు మినహా ప్రతి రోజూ సంపూర్ణ మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. అన్నం, పప్పు, కూరగాయలు, గుడ్డుతో భోజనంతో పాటు 200 మిల్లీలీటర్ల పాలు అందిస్తారు. కేంద్రాలకు వచ్చే 3 నుంచి ఆరేండ్లలోపు పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం, నెలకు 16 గుడ్లు అందించనున్నారు. ప్రతిరోజూ గర్భిణులు, బాలింతలు ఒక్కొక్కరికి 150 గ్రాములు, చిన్నారులకు 75 గ్రాముల చొప్పున బియ్యం వినియోగిస్తారు.
వికారాబాద్ జిల్లాలో 65,078 మందికి లబ్ధి
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 65078 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుంది. జిల్లాలోని మర్పల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 906 మంది, బాలింతలు 858 మంది, ఏడు నెలల నుంచి మూడేండ్లలోపు చిన్నారులు 4839 మంది, 3-6 ఏండ్లలోపు చిన్నారులు 3009 మంది ఉన్నారు. పరిగి ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 1122 మంది, బాలింతలు 1062 మంది, మూడేండ్లలోపు చిన్నారులు 6392 మంది, 3-6 ఏండ్లలోపు చిన్నారులు 3297 మంది ఉన్నారు. తాండూరు ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 1764 మంది, బాలింతలు 1681 మంది, మూడేండ్లలోపు చిన్నారులు 9075 మంది, 3-6 ఏండ్లలోపు చిన్నారులు 5840 మంది, వికారాబాద్ ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 1401 మంది, బాలింతలు 1301 మంది, మూడేండ్లలోపు చిన్నారులు 7327 మంది, 3-6 ఏండ్లలోపు చిన్నారులు 4022 మంది, కొడంగల్ ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 1023 మంది, బాలింతలు 881 మంది, మూడేండ్లలోపు చిన్నారులు 5102 మంది, 3-6 ఏండలోపు చిన్నారులు 4176 మంది ఉన్నారు.
మంచి నిర్ణయం : శారదాబాయి, బాలింత, గాజులకుంటతండా, బొంరాస్పేట మండలం
సన్న బియ్యంతో భోజనం పెట్టాలన్న నిర్ణయం బాగుంది. ఇప్పటివరకు దొడ్డు బియ్యంతో వండిన భోజనం తింటున్నాం. సన్న బియ్యంతో అందించే భోజనంతో బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందుతుంది. ఆరోగ్యపరంగా మాకు ఎంతో లాభం కలుగుతుంది.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు : స్వాతి, గర్భిణి, గాజులకుంటతండా, బొంరాస్పేట మండలం
సన్న బియ్యంతో భోజనం అందించాలన్న నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సన్న బియ్యంతో వండిన భోజనం పెడితే మంచి పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటారు. దొడ్డు బియ్యంతో పెట్టే భోజనాన్ని కొందరు తినడంలేదు. ఇప్పుడు అందరూ ఇష్టంగా తింటారు.
హాజరు శాతం పెరుగుతుంది
– జీవనజ్యోతి, అంగన్వాడీ టీచర్, గాజులకుంటతండా, బొంరాస్పేట మండలం
అంగన్వాడీ కేంద్రాల్లో సన్న బియ్యంతో భోజనం అందించాలన్న నిర్ణయం చాలా మంచిది. కేంద్రాలకు వచ్చేవారు ఎక్కువగా పేదవారు ఉంటారు. సన్న బియ్యంతో భోజనం పెడితే చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు వచ్చి తింటారు. దీనివల్ల కేంద్రాల్లో హాజరు శాతం కూడా పెరుగుతుంది.