రంగారెడ్డి, జూలై 5 (నమస్తే తెలంగాణ): జిల్లాలో సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఈ ప్రక్రియను వేగిరం చేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగటంలేదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు జిల్లాలో నివా సం ఉంటుండడంతో వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందించేందుకు అధికార యంత్రాంగం అవస్థలు పడుతున్నది. జిల్లాలో ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్న అనేకమంది తమ సొం త జిల్లాల్లో నివాసముంటున్నారు. శేరిలింగంపల్లి, గండిపేట, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్, తుర్కయాంజాల్, ఆదిబట్ల, అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైన వారికి ఎన్యూమరేషన్ ఫారాలు అందించేందుకు వారి చిరునామాలు దొరుకక బీఎల్వోలు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా అధికారులతోపాటు పలు పార్టీలకు చెందిన బీఎల్ఏలు కూడా ఈ ప్రక్రియపై దృష్టి సారించటం లేదన్న ఆరోపణలున్నా యి. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ గడువు ఆదివారంతో ముగిసింది. ఇప్పటికీ 60 శాతం కూడా ఫారాల పంపిణీ జరగలేదని సమాచారం. కాగా, మరోవైపు సోమవారం నుంచి పంపిణీ చేసిన ఫారాలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉన్నది. ఫారాల పంపిణీ పూర్తి కాకపోవటంతో ఆన్లైన్లో చేర్చేందుకు అధికారులు అనే క తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఎల్వో లు గ్రామాల్లోని కమ్యూనిటీహాళ్లలో కూర్చుని ఓటర్లను పిలిపించుకుని ఎన్యూమరేషన్ ఫారాలను అం దజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఓటర్లు కమ్యూనిటీహాళ్లకు వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో జిల్లాలో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది.
జిల్లాలో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య..
సర్ ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ఓటరు జాబి తా సవరణలో జిల్లాలో భారీగా ఓటర్ల సంఖ్య తగ్గనున్నది. ముఖ్యంగా నల్గొండజిల్లాకు చెందిన అనేకమంది తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట, అబ్దుల్లాపూర్మెట్, ఆదిబట్ల ప్రాంతాల్లో నివాసముంటూ ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారు. అలాగే, కల్వకుర్తి, ఆమనగల్లు ప్రాంతాల నుంచి వచ్చిన వారు మహేశ్వరం, కందుకూరు ప్రాంతాల్లో, షాద్నగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో నివాసముం టూ ఆయా ఇండ్లలో ఓటర్లుగా నమోదు చేసుకున్నా రు. పలు కారణాలతో వారు సొంత ప్రాంతాలకు వెళ్ల్లిపోయారు. దీంతో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ బీఎల్వోలకు తలకు మించిన భారంగా మారింది.
ఇంకా పూర్తి కాని ఫారాల పంపిణీ..
సర్ ప్రక్రియలో భాగంగా ఆదివారం వరకే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని పూర్తి చేయాలని ఈసీ(ఎన్నికల కమిషన్) గడువు విధించారు. కానీ, అడ్రస్లు అందుబాటులో లేకపోవటం.. ఫారాలను నింపటంలో ఓటర్లకు అవగాహన లేకపోవటంతో ఈ ప్రక్రియకు అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. మ రోవైపు ఆయా పార్టీలు ఏర్పాటు చేసిన ప్రతినిధులు కూడా ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు ఆశించిన స్థాయిలో సహకరించడంలేదన్న ఆరోపణలున్నాయి.
అయోమయంలో ఓటర్లు..
జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ఓట్లే అధికంగా ఉన్నాయి. వారి సొంత ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉన్నవారు..ఉద్యోగాలు, పిల్లల చదువు, పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి తాత్కాలికంగా నివాసముంటున్నారు. వీరందరూ ఇక్కడ కూడా ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఓటర్లు ముందుగా తమ గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకుని.. అనంతరం హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లోనూ ఓట్లేశారు. ప్రస్తుతం సర్ ప్రక్రియ ద్వారా తాము ఎక్కడ ఓట్లు ఉంచుకోవాలనే దానిపై సందిగ్ధంలో పడ్డారు. ఎక్కువమంది తమ సొంత గ్రామాల్లోనే ఓట్లను ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో శివారు ప్రాంతాల్లో ఓటుపై అంత ఆసక్తి చూపకపోవటంతో వారికి ఫారాలను అందించడం బీఎల్వోలకు ఇబ్బందికరంగా మారింది.
ఫారం ఎలా నింపాలో అర్థం కావటం లేదు
ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా నింపాలో అర్థం కావడంలేదు. ఇంటింటికొచ్చి బీఎల్వోలు ఫారాలను పంపిణీ చేస్తున్నారు. కానీ, వాటిని ఎలా పూరించాలో తెలియడంలేదు. దీంతో చాలామంది ఫారాలను నింపటంలో ఇబ్బంది పడుతున్నారు.
– ఫైసల్ అలీ, తుర్కయాంజాల్
వార్డు ఆఫీస్కెళ్లి తెచ్చుకున్నా..
ఇంటికొచ్చి ఫారం ఇవ్వలేదు. వార్డు ఆఫీస్కెళ్లి తెచ్చుకున్నా. ఫారం తీసుకోండి ఎలా నింపాలో ఇంటికొచ్చి చెబుతామన్నారు. ఇప్పటికీ ఎవ రూ రాలేదు. ఇంట్లోని పిల్లలకు దానిని ఎలా నింపాలో అర్థం కావడంలేదు. ఫారాలను అంగన్వాడీ టీచర్లు ఇచ్చారు. అధికారులు ఎవరూ ఇంటికి రాలేదు.
పాటి సుజాత, పెద్దమంగళారం,మొయినాబాద్ మున్సిపాలిటీ
వివరాలు అర్థం కావడంలేదు..
ఎన్యూమరేషన్ ఫారంలోని వివరాలు ఓటర్లకు తలనొప్పిగా మారింది. ఫారంలో అడిగిన వివరాలు అర్థం కావడంలేదు. ఒక్క అక్షరం లేదా ఒక సంఖ్య తప్పుగా ఎంట్రీ చేసినా మొత్తం ఫారాన్ని మళ్లీ నింపాల్సి వస్తున్నది. ఒకే కుటుంబసభ్యుల వివరాల్లో తేడాలు ఉండటంతో మరింత ఇబ్బందిగా మారింది. అధికారులు పై సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన మార్పులు చేయాలి.
-ఇమ్రాన్, చేవెళ్ల/చేవెళ్లటౌన్
ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి
మా ఇంటికి బీఎల్వో వచ్చి ఫారం ఇచ్చి వెళ్లారు. కానీ, దానిని ఎలా నింపాలి, ఏయే కాలమ్స్లో ఏ వివరాలను నమోదు చేయాలి, ఏ ధ్రువపత్రాలు జత చేయాలో చెప్పలేదు. గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించి ప్రజల సందేహాలను నివృత్తి చేస్తే సర్ ప్రక్రియ మరింత సజావుగా సాగుతుంది. అధికారులు ఫారాలిచ్చి వెళ్లిపోకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి
– తెలుగు మాణిక్యం, చేవెళ్ల మండలం
ప్రజల్లో ఆందోళన మొదలైంది..
బీఎల్వోలు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా నింపా లో చాలామందికి తెలియడంలేదు. బీఎల్వోలు ఇంటింటికీ తిరగడంలో జాప్యం జరుగుతున్నది. గడువు దగ్గర పడుతుండడంతో ఓటు హక్కు ఉంటుందా?.. ఉండదా..? అని ప్రజల్లో ఆందోళన మొదలైంది. బీఎల్వోలు నిరాక్షరాస్యుల ఫారాలను నింపడంలేదు. ప్రభుత్వం ఓటర్లకు సరిపడా బీఎల్వోలను నియమిస్తే బాగుంటుంది.
-రాజూనాయక్, మోకిల, శంకర్పల్లి రూరల్