పరిగి, ఫిబ్రవరి 12 : పరిగి పట్టణంలో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం దేవాదాయ శాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శేఖర్, ఇన్స్పెక్టర్ మధుబాబు, అనంతగిరి దేవాలయం ఈవో నరేందర్, పరిగి ఆలయ ఈవో శ్రీనివాస్శర్మ, అత్తాపూర్ ఈవో ప్రవీణ్, హైదర్గూడ ఈవో చంద్రమోహన్ పరిగిలోని ఆలయాన్ని సందర్శించి ఆలయంలో గల అన్ని వస్తువులు, ఆస్తుల వివరాలు సేకరించారు. 2018 ఏప్రిల్ 19వ తేదీన అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ పరిగి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుంటూ, ఈవోను నియమించగా అప్పట్లో ఆలయ కమిటీ వారి విన్నపం మేరకు 2018 ఏప్రిల్ 25వ తేదీన ప్రిన్సిపల్ సెక్రటరీ స్టే విధించారు.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈనెల 8వ తేదీన దేవాదాయ శాఖ కమిషనర్ స్టేను ఎత్తివేయడంతోపాటు 10వ తేదీన పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవోగా శ్రీనివాస్శర్మను నియమించారు. దేవాదాయ శాఖ అధికారులు ఎవరికీ చెప్పకుండా, ఆలయ కమిటీ వారికి సైతం సమాచారం ఇవ్వకుండా, కేవలం కాం గెస్ నాయకులకే సమాచారం ఇచ్చి సోమవారం ఉదయం పరిగి ఆలయానికి చేరుకున్నారు. పరిగి ఆలయానికి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు బాబయ్య, ప్రధాన కార్యదర్శి బి.ప్రవీణ్కుమార్రెడ్డి, కమిటీ సభ్యులను పిలిపించి మాట్లాడారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా రావాల్సిన అవసరం ఏమిటని కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
తమ హయాంలో చేపట్టిన దేవాలయం, హనుమాన్ ఆలయం, ధ్వజస్తంభం, షెడ్డు నిర్మాణాలు, దుకాణాల నిర్మాణానికి సంబంధించి అన్ని అంశాలపై సమావేశం ఏర్పాటు చేసి అందరి సమక్షంలో వివరాలు పెట్టి, ఆదాయం, ఖర్చు సైతం తెలియజేస్తామని, అలాంటిది అకస్మాత్తుగా వస్తే ఎలా అని అన్నారు. అనంతరం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శేఖర్, ఇతర అధికారులు ఆలయంలోని వస్తువులు, దేవాలయ పరిధిలోని ఆస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి వస్తువు, ఆస్తుల వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా 22 దుకాణాలు ఉండగా వాటిలో అద్దెకు ఉంటున్న వారందరినీ విచారించి ఎంత అద్దె చెల్లిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
అలాగే ఆలయంలో పనిచేసే అర్చకులు, ఇతర వారికి ఇస్తున్న వేతనాలను అడిగి తెలుసుకొని నమోదు చేసుకున్నారు. ఆభరణాల అంశంపై సైతం ఆలయ కమిటీ వారితో చర్చించారు. ఈ సందర్భంగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శేఖర్కు జేఏసీ జిల్లా చైర్మన్ ముకుంద నాగేశ్వర్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ అరవిందరావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, మాజీ జడ్పీటీసీ ఎస్పీ బాబయ్య, కాంగ్రెస్ నాయకులు పరశురాంరెడ్డి, ఎ.కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.