రంగారెడ్డి, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో సర్వేయర్ల సమస్య వేధిస్తున్నది. రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా ఏండ్ల తరబడిగా భూముల సర్వే మాత్రం కావడం లేదు. మరోవైపు దరఖాస్తుదారులు ప్రతిరోజూ సర్వేయర్ల చుట్టూ తిరుగుతున్నారు. భూసమస్యలు అత్యధికంగా ఉన్న జిల్లాలో సరిపడా సర్వేయర్లు లేకపోవటం పెద్ద సమస్యగా మారింది. తహసీల్దార్ కార్యాలయాల్లోనే అత్యధికంగా సర్వే సమస్యలు పెండింగ్లో ఉన్నాయి..
జిల్లాలోని 21 గ్రామీణ మండలాలతోపాటు 6 శివారు మండలాలున్నాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉండడంతో భూముల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా యి. సర్వే సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికంగా రైతులే ఉన్నారు. మరోవైపు భూ ముల క్రయవిక్రయాల్లోనూ సర్వే పూర్తైనా తర్వాతే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సకాలంలో సర్వే జరగకపోవడంతో రిజిస్ట్రేషన్లలో తీవ్ర జాప్యం నెలకొంటున్నది. దరఖాస్తులు సర్వేయర్ను కలవాలంటే ఏండ్లు పడుతున్నది. సకాలంలో దొరికినా వారు స్పందించటం లేదు. మరోవైపు ఫోన్లు చేసినా సమాధానం చెప్పటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, షాద్నగర్, రాజేంద్రనగర్ సబ్డివిజన్ల పరిధిలో 27 మండలాలుండగా.. 12 మందే సర్వేయర్లే ఉండడంతో ఇందులో ఒక్కో వ్యక్తి రెండు నుంచి మూడు మండలాలకు ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సర్వేకు సంబంధించిన సమస్యలు రోజురోజుకూ మరింత జఠిలమవుతున్నాయి.
జిల్లాలోని ఒక్కో సర్వేయర్కు రెండు నుంచి మూడు మండలాలకు ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు ఉండడంతో.. సర్వేయర్లు కొంతమందిని అసిస్టెంట్గా నియమించుకున్నారు. సర్వేయర్లు అందుబాటులో లేకపోవటంతో తాము నియమించుకున్న ప్రైవేట్ సర్వేయర్లతో భూములను సర్వే చేయిస్తున్నారు. వారు చేసిన సర్వేలకు ప్రభుత్వ సర్వేయర్లు మ్యాప్లపై సంతకాలు పెట్టి నకళ్లు ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లో సర్వేయర్ల అసిస్టెంట్లు హవా కొనసాగిస్తున్నారు. మరోవైపు డబ్బులిచ్చిన వారికే అనుకూలంగా సర్వే చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సర్వేయర్లు కూడా వారు చెప్పిందే నమ్ముతున్నారు. దీంతో పేద, సామాన్య రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
జిల్లాలో సర్వే కోసం పది వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. భూముల సర్వేకోసం రైతులు.. ప్రైవేట్ సంస్థలకు చెందిన ఆస్తుల కోసం పలువురు ఆన్లైన్లో దరఖాస్తు ఏండ్ల తరబడిగా ఎదురుచూస్తున్నారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మహేశ్వరం, కందుకూరు, మంచాల, యాచారం, మాడ్గుల వంటి మండలాల్లో సర్వే దరఖాస్తులు అత్యధికంగా పెండింగ్లో ఉన్నాయి.
జిల్లాలో ఓ వైపు సర్వేయర్ల సమస్య వేధిస్తుండగా.. ఉన్న సర్వేయర్లకు అదనపు బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో భూసేకరణ ముమ్మరంగా సాగుతున్నది. యాచారం, కందుకూరు, మహేశ్వరం, కొం దుర్గు, శంషాబాద్, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు, షాబాద్ తదితర మండలాల్లో రేడియల్, గ్రీన్ఫీల్డ్ రోడ్లతోపాటు టీజీఐఐసీ తీసుకునే వివిధ భూములకు సంబంధించి సర్వేను వేగవంతం చేశారు. ఈ సర్వే పనులకు ఉన్న 12 మందిలో ఆరుగురిని కేటాయిస్తున్నారు. దీంతో రోజుల తరబడి సర్వేయర్లు భూసేకరణ సర్వేనే చేస్తున్నారు. అదనపు బాద్యతలతోపాటు అదనపు పనుల్లో సర్వేయర్లు ఉండటంతో రైతుల సమస్యలు తీరటంలేదు.