మోమిన్పేట, జనవరి 20 : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో వెలసిన శనైశ్చర స్వామి ఆలయంలో శని అమావాస్య సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. శని అమావాస్య, శని త్రయోదశి స్వామి వారికి ప్రత్యేకం. ఈ రోజుల్లో శనైశ్చర స్వామికి నల్ల వస్త్రం, నల్ల నువ్వులు, నల్ల నువ్వుల తైలాభిషేకం, పువ్వులు చాలా ప్రీతికరం.
ఆలయ ప్రాంగణంలో..
ఆలయ ప్రాంగణంలో హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన శంకర్ భారత్ మహారాజ్ ప్రతిష్ఠించిన శనైశ్చర విగ్రహంతో పాటు సప్త ఆలయాల్లో ఆంజనేయస్వామి, సమర్థ రామదాసు స్వామి, బక్క ప్రభు మహారాజ్, జ్ఞానేశ్వర మహారాజ్, మార్కండేయ రుషి మహారాజ్, దత్తాత్రేయ స్వామి, నర్మదామాతా శివాలయంతో పాటు సప్త వృక్షాలను సప్త దేవతల రూపాలుగా పేర్కొంటారు.
నేటి ప్రత్యేకత..
ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలు నిద్ర నుంచి మేల్కొ నే సమయంలో ముందుగా వచ్చే అమావాస్య పౌష్యమాసంలో శనివారం.. అమావాస్య కలిసిన తిథి విశిష్టమైన రోజు. అలాంటి రోజు శనైశ్చరస్వామిని దర్శించే కనులు.. నామ జపం చేసే నోరు.. స్మరించే హృదయం.. స్వామి సేవలో తరించే శరీరం.. ధ్యానం.. భక్తితో మనస్సును అర్పించి ప్రార్థిస్తే ఎంతో తృప్తి చెందే మనోవాంఛలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు అశోక్రావు తెలిపారు.
ఆలయానికి ఇలా చేరుకోవచ్చు..
మోమిన్పేట మండల కేంద్రం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో శంకర్పల్లి హైదారాబాద్ వెళ్లే మార్గంలో ఎన్కతల గ్రామంలో శనైశ్చర స్వామి ఆలయం ఉంది. శంకర్పల్లి నుంచి మోమిన్పేట వెళ్లే మార్గంలో 20 కిలో మీటర్ల దూరంలో ఈ గ్రామం వస్తుంది. శనైశ్చర స్వామిని దర్శించుకోవడానికి బస్సు సౌకర్యం కలదు. ప్రత్యేక రోజుల్లో ఎన్కతలకు సంగారెడ్డి, వికారాబాద్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు సడుపుతారు. భక్తుల సౌకర్యార్థం మంచి నీరు, వాహనాల పార్కింగ్ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఈవో శేఖర్ గౌడ్ తెలిపారు.