షాద్నగర్టౌన్ : యుద్ధవిద్యతో ఆత్మస్థెర్యం పెరుగుతుందనే విషయాన్ని అందరూ గ్రహించాలని సినీ నటుడు సుమన్ అన్నారు. పట్టణంలోని మరియారాణి పాఠశాలలో యాదవ బుడోకాన్ కరాటేక్లబ్ ఇంటర్నేషనల్, రేజింగ్ సన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఆర్గనైజేషన్ పౌండర్, మాస్టర్ మల్లేశ్యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సుమన్ చిల్డ్రన్ మార్షల్ ఆర్ట్ అకాడమీ 20వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాణం ఎంతో విలువైందని, ఆపద సంభవించిన సమయల్లో తమ ప్రాణాలను తాము కాపాడుకోవడానికి యుద్ధవిద్య ఎంతో ఉపయోగపడుతుంద న్నారు. యుద్ధవిద్యను నేర్చుకోవడం ద్వారా క్రమశిక్షణ పెరుగుతుందని, యుద్ధవిద్యకు వయస్సుతో సంబంధం లేకుండా అందరూ నేర్చుకోవచ్చన్నారు.
చిన్నతనం నుంచి యుద్ధవిద్యను నేర్చుకోవడం ద్వారా శరీర దృఢత్వం, మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. అదే విధంగా మహిళలకు యుద్ధవిద్య ఎంతో అవసరమన్నారు. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయని, దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకునేందుకు యుద్ధవిద్య దోహదపడుతుందన్నారు. చదువు, స్పోర్ట్స్, ఇతర రంగాలు ఎంత అవసరమో యుద్ధవిద్య కూడా అంతే అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ యుద్ధవిద్యను నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు భవిష్యత్లో ఎంత ఎత్తుకు ఎదిగిన తమ తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను మర్చిపోవద్దన్నారు. చిన్నతనం నుంచి చిన్నారులను యుద్ధవిద్యలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, శిక్షణ ఇస్తున్న మాస్టర్లను ప్రత్యేకంగా అభినందించారు.
అంతకు ముందు సినీ నటుడు సుమన్ను మాస్టర్ మల్లేష్యాదవ్ శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. యుద్ధవిద్య శిక్షణ పొందిన విద్యార్థులకు బెల్టులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, నాయకులు వీర్లపల్లి శంకర్, విజయ్కుమార్రెడ్డి, రాజేందర్, పాఠశాల ప్రిన్సిపాల్ అలెగ్జాండర్, మాస్టర్లు సాయినాథ్, ఉత్తేజ్, నరేందర్, వినయ్, శ్రీను నాయక్ పాల్గొన్నారు.