షాద్నగర్ రూరల్, జనవరి 29 : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాడిపరిశ్రమ అభివృద్ధితో గ్రామాలు మరింత ప్రగతి పథంలో ముందుంటాయన్నారు. పశువైద్య శాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను కచ్చితంగా నెరవేర్చు తుందన్నారు.
అంతకుముందు ఆయన కుందేలుకుంటతండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వినయ్కుమార్, ఎంపీపీ ఖాజాఇద్రిస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, సర్పంచ్లు అరుణ,రవీందర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు, పాలకులు సమస్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు. షాద్నగర్ పట్ణణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఖాజా ఇద్రిస్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని.. అధికారులు, పాలకులు రాజకీయాలకతీతంగా పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుంటాయన్నారు.
ఈ సందర్భంగా పలువురు సభ్యులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు సర్పంచ్లు, ఆర్టీసీ అధికారులను అడుగగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి రాగానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సర్పంచ్లను ప్రత్యేకంగా అభినందించారు. సర్పంచ్ల పదవికాలం ముగిసినప్పటికీ వారికి రావాల్సిన బిల్లులను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యేను సర్పంచ్లు, ఎంపీటీసీలు సన్మానించారు. అదేవిధంగా పలువురు సర్పంచ్లను కూడా సన్మానించారు. అంతకుముందు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతనీకరణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పార్థసారథి, ఎంపీడీవో వినయ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, వైస్ ఎంపీపీ మౌనిక, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నందిగామ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మండలంలోని అప్పారెడ్డిగూడ గ్రామంలో సర్పంచ్ జె.కె.నర్సింహులు ఆధ్వర్యంలో రూ.10లక్షల జిల్లా పరిషత్ నిధులతో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ఎంపీపీ ప్రియాంకగౌడ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నదని, మహిళలకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. భవన నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన రవీందర్రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షురాలు కట్న లత, ఉప సర్పంచ్ సీతారాములు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.