షాద్నగర్ : దిశ ఎన్కౌంటర్ సంఘటన చర్చనీయశంగా మారింది. దిశ సంఘటన జరిగి నేటితో మూడేళ్లు గడిచినప్పటికీ నాటి నుంచి నేటి వరకు దిశ ఎన్కౌంటర్ ఘటన వివరాలను స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే దిశ ఎన్కౌంటర్ ఘటనను క్షేత్రస్థాయిలో విచారించే క్రమంలో సిర్పూర్కర్ కమిషన్ సభ్యులు ఆదివారం దిశ నిందితుల ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించారు. ముందుగా శంషాబాద్ మండల పరిధిలోని తొండుపల్లి సమీపంలో దిశపై జరిగిన హత్యచార స్థలాన్ని పరిశీలించిన సభ్యులు అక్కడి నుంచి షాద్నగర్ బైపాస్ మీదుగా చటాన్పల్లి చేరుకున్నారు. మొదటగా దిశ మృతదేహాం పడేసిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికి, ఆ ప్రాంతమంత చెరువు నీళ్లు ఉండడంతో కమిషన్ సభ్యులు నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రాంతానికి వెళ్లారు.
నిందితులు నలుగురు ఏ ప్రాంతంలో మృతి చెందారు ? ఎలా తప్పించుకునేందుకు ప్రయత్నించారు ? బైపాస్ రోడ్డు నుంచి ఎన్కౌంటర్ స్థలానికి ఎలా వచ్చారు ? అనే అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే దిశ ఎన్కౌంటర్ సీట్ బృందం ప్రధాన పోలీస్ అధికారి, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ నిందితుల ఎన్కౌంటర్కు దారితీసిన పరిస్థితులు, ఎన్కౌంటర్ తీరు, సంఘటన స్థలంలో నిందితులు వ్యవహిరించిన తీరు వంటి అంశాలను కమిషన్ సభ్యులకు వివరించినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం కమిషన్ సభ్యులు నేరుగా షాద్నగర్ బైపాస్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్లో 30నిమిషాల పాటు సేదతీరారు. అక్కడి నుంచి పట్టణంలోని షాద్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి నిందితులు వ్యవహరించిన తీరుపై సంబంధిత అధికారులతో ఆరా తీసినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్ పరిశీలించిన అనంతరం కమిషన్ సభ్యులు, సీట్ బృందం సభ్యులు హైదరాబాద్కు వెళ్లారు. ఇదిఇలా ఉంటే దిశ సంఘటన నిందితులకు అనుకూలంగా వ్యవహిరించే విధంగా సిర్పూర్కర్ కమిషన్ పనిచేస్తుందని ఆరోపిస్తు షాద్నగర్ ప్రజా సంఘాల నాయకులు షాద్నగర్ పోలీస్ స్టేషన్ ముందు నిరసనలు తెలిపారు. కమిషన్ సభ్యులు పోలీస్ స్టేషన్ను పరిశీలిస్తుండగా కమిషన్ సభ్యుల పనితీరుకు వ్యతిరేఖంగా నినదాలు చేశారు. గో బ్యాక్ కమిషన్ అంటు నిరసనలు తెలిపారు. దిశ నిందితుల ఎన్కౌంటర్తో మహిళలు, యువతులకు కొంత దైర్యం వచ్చిందని చెప్పారు. కమిషన్ క్షేత్రస్థాయి విచారణ అర్థరహితంగా ఉందని ఆరోపించారు.
పోలీస్ స్టేషన్ ముందు నిరసనలు తెలుపుతున్న ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకొని శాంతింప చేశారు. పలువురు కమిషన్ సభ్యులకు వినతి పత్రాలను ఇచ్చేందుకు ప్రయత్నించారు. నాయకులు పినపాక ప్రభాకర్, ప్రతాప్రెడ్డి, యువసత్తా లక్ష్మణ్కుమార్, ఎండీ ఎజాజ్, శరత్కుమార్లు తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు. ఇది ఇలా ఉంటే కమిషన్ సభ్యుల క్షేత్రస్థాయి విచారణలో భాగంగా షాద్నగర్ ఏసీపీ కుషల్కర్, సీఐ నవీన్ కుమార్, స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.