షాబాద్, జూన్ 16: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో సోమవారం గ్రామపంచాయతీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో ఉన్న రెండు బోర్లు కాలిపోవడంతో పాటు, మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటి కోసం బిందెలు పట్టుకొని ప్రజలు ట్యాంకర్ల వద్దకు పరిగెత్తుతున్నారు.
గ్రామానికి వచ్చిన నీటి ట్యాంకర్ ఒక ఇంటికి రెండు బిందెలు చొప్పున నీటిని అందిస్తుండటంతో తమకు నీరు సరిపోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ హయంలో ఏనాడు కూడా ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడలేదని, కాంగ్రెస్ పాలనలో మాత్రం తాగునీటి బాధలు తప్పడం లేదని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్రామంలో తాగునీటి సరఫరా బోర్లను మరమ్మత్తులు చేయించాలని.. తాగునీటి ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.