చదువుకోవాలనే తపన, పుస్తకాల మీదున్న ధ్యాస, పాఠశాలనే ఓ ఆలయంగా భావించే చిన్నారికి బృహత్తరమైన ఆలోచన తట్టి వందలాది మంది చదువుకునేందుకు పునాదిగా మారింది. చదువు, పుస్తకాలు చాలా విలువైనవని ఆ చిన్నారి కదలికలతో చెప్పకనే చెప్పింది. తనకు తోచిన విధంగా అక్కడక్కడా తిరిగి వేల పుస్తకాలను సేకరించింది. ఏడు గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రధాన కారకురాలిగా నిలిచింది.
అమీర్పేట్, ఆగస్టు 8: సనత్నగర్కు చెందిన ఆకర్షణ సతీష్(11), హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. తనకు వచ్చిన ఓ మంచి ఆలోచన.. ఆ చిన్నారిని పుస్తకాల సేకరణకు పురిగొల్పింది. తన మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువుల నుంచి సేకరించిన దాదాపు 5,800 పుస్తకాలతో గ్రంథాలయాల ఏర్పాటుకు పూనుకుంది. చిన్న వయసు నుంచి మొదలు పీజీ స్థాయి విద్యార్థుల వరకు అవసరమైన అన్ని వైజ్ఞానిక, చారిత్రక, కథలు, వివిధ దశలైన ప్రాథమిక, ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ, పీజీ స్థాయితో పాటు ఇంజినీరింగ్, సీఏ పుస్తకాలు, కళాశాల తరగతులకు చెందిన పుస్తకాలను ఆకర్షణ ఎంతో నేర్పుగా సేకరించింది. ఇక వీటిని వినియోగంలోకి తీసుకురావాలన్న తన ఆలోచనకు తండ్రి సతీష్ నుంచి పూర్తి సహకారం అందడంతో గ్రంథాలయాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది.
ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో..
తాను సేకరించిన పుస్తకాలలోని 1036 పుస్తకాలతో నగరంలోని ఎంఎన్జే క్యాన్పర్ ఆసుపత్రిలో చిన్నారుల వార్డులో తొలి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన ఆకర్షణ, తన రెండో గ్రంథాలయాన్ని 829 పుస్తకాలతో సనత్నగర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసింది. 625 పుస్తకాలతో నింబోలి అడ్డాలోని ప్రభుత్వ బాలికల సదనం (జువెనైల్ హోం)లో మూడో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి గ్రంథాలయాలు తమిళనాడులోని కోయంబత్తూరులో మరో మూడు ఏర్పాటు చేసిన ఆకర్షణ, తన 7వ గ్రంథాలయాన్ని ఇటీవల సనత్నగర్లోని అశోక్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 610 పుస్తకాలతో ఏర్పాటు చేసింది. ఈ గ్రంథాలయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్పొరేటర్ కొలన్ లక్ష్మీరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఇంత చిన్న వయసులో తనకు వచ్చిన ఒక మంచి ఆలోచనను, పక్కా ప్రణాళికతో తన చదువులకు ఎక్కడా ఆటంకాలు తలెత్తకుండా, ఆచరణలో పెడుతున్న చిన్నారి ఆకర్షణ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి అభినందించారు.