బొంరాస్పేట, డిసెంబర్ 22 : వికారాబాద్ జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో వానలు సమృద్ధిగా కురువడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండడం, బోర్లలో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు వరి పంటలను గణనీయంగా పండించారు. దీంతో పాటు కొత్తరకం వంగడాలతో నాటు వేయడంతో దిగుబడులు కూడా పెరిగిన ఫలితంగా కేంద్రాలకు ధాన్యం పోటెత్తింది. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది.
ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జిల్లాలో125 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 59, ఐకేపీ ఆధ్వర్యంలో 29, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 28, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 7, రైతు సంఘాల ఆధ్వర్యంలో 3 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే ఏ గ్రేడు ధాన్యానికి రూ.2060, బీ గ్రేడు ధాన్యానికి రూ.2040 చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకే తెస్తున్నారు. రైతులు తెచ్చిన ధాన్యంలో తేమ శాతం ఎంత ఉందో పరిశీలించి తూకం వేసి దాని ప్రకారమే ధరను చెల్లిస్తున్నారు. ధాన్యంలో తాలు, మట్టిని తొలగించడానికి కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం యంత్రాలను సరఫరా చేసింది. వాటిద్వారా తాలు, మట్టిని తొలగిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఓటీపీ విధానాన్ని అమలు చేస్తున్నది. తూకం వేసిన వెంటనే వాటి వివరాలను ట్యాబ్లో అప్లోడ్ చేస్తున్నారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎంతో మేలు చేసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చకచకా మిల్లులకు తరలింపు
కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 74,997 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ రైస్ మిల్లింగ్(సీఎంఆర్) కోసం రైస్ మిల్లులకు పంపించారు. 2,910 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించాల్సి ఉంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు ఖాళీ కావడంతో రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే తూకం చేయడానికి అవకాశం కలిగింది. ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు చేరడంతో రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు వెంటవెంటనే జమవుతున్నాయి.
రూ.160 కోట్ల విలువైన 77,908 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలోని 125 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంగళవారం నాటికి 15,022 మంది రైతుల నుంచి 160.49 కోట్ల విలువైన 77,908 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఐకేపీ కేంద్రాల ద్వారా 18,846 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ల ద్వారా 33,830., డీసీఎంఎస్ల ద్వారా 19,965., మార్కెట్ కమిటీ కేంద్రాల ద్వారా 3,416, రైతు సంఘాల ద్వారా 1,850 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 65,231 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలను ట్యాబ్లలో నమోదు చేయగా రైతుల ఖాతాల్లో రూ.86.73 కోట్లు జమయ్యాయి. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. మార్కెట్కు, మధ్య దళారులకు అమ్మే అవకాశం లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి లాభం పొందుతున్నారు. సకాలంలో డబ్బులు కూడా ఖాతాల్లో జమవుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధరలకు ధాన్యాన్ని కొంటుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మడానికి మొగ్గు చూపుతున్నారు.