బొంరాస్పేట, జనవరి 23 : నేటి సమాజంలో బాలికలకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయం. ఆకతాయిలు, పోకిరీల ఆగడాలు, వేధింపులు, అత్యాచారాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి బాలికలకు ఆత్మరక్షణ విద్య ఎంతో అవసరం. దీనిని గుర్తించిన ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే బాలికలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నది. 2017-18 నుంచి 2019-20 విద్యా సంవత్సరం వరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ కార్యక్రమాన్ని అమలు చేసింది. తరువాత కరోనా రావడం, పాఠశాలలు మూతపడడంతో దీనిని మూడేండ్లుగా అమలు చేయడంలేదు.
కొవిడ్ తగ్గుముఖం పట్టడం, పాఠశాలలు ఎప్పటి మాదిరిగానే పని చేస్తుండడంతో బాలికలకు ఈ ఏడాది రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ పేరుతో ఆత్మరక్షణ విద్యను అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వికారాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన 205 ఉన్నత, కేజీబీవీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 24 నుంచి ప్రారంభించి నెల రోజుల పాటు కరాటేలో శిక్షణ ఇవ్వనున్నారు. జాతీయ బాలికా దినోత్సవం రోజునే ఈ కార్యక్రమం అమలు కావడంపై బాలికలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజులపాటు శిక్షణ
ఆత్మరక్షణ విద్యను జిల్లాలోని 205 ఉన్నత పాఠశాలల్లో నెల రోజులపాటు అమలు చేయనున్నారు. వీటిలో 18 కేజీబీవీలు ఉండగా, 187 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు కరాటేలో నెల రోజులపాటు శిక్షణ ఇస్తారు. గతంలో మూడు నెలలు శిక్షణ ఇవ్వగా ఈసారి ఒక నెల పాటు శిక్షణ ఇస్తారు. ఒక్కో పాఠశాలకు ఒక శిక్షకుడిని ఎంపిక చేశారు. వీరికి నెల రోజులకు రూ.5వేలు వేతనం ఇవ్వనున్నారు. పాఠశాల సమయాలు ఉదయం 9.30 నుంచి సాయం త్రం 4.45 గంటల వరకు ఎప్పుడైనా విద్యార్థుల చదువులకు అంతరాయం కలుగకుండా దీనిని నేర్పిస్తారు. పైగా వార్షిక పరీక్షలు సమీపిస్తుండడంతో చదువులపై దృష్టి సారిస్తున్నారు. తరగతులు పూర్తయిన తరువాత సాయంత్రం గంటపాటు ఆత్మరక్షణ పాఠాలు బోధించి ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో మెళకువలు నేర్పిస్తారు.
బాలికలకు ఎంతో ఉపయోగం ఆకతాయిల ఆగడాల నుంచి బాలికలు తమను తాము రక్షించుకోవడం, శారీరక దృఢత్వం సాధించడం, మానసికోల్లాసం కలిగించేందుకు ఆత్మరక్షణ విద్య ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో బాలికలకు కరాటే నేర్పారు. కరాటే నేర్చుకుంటే బాలికల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ధైర్యంగా ఆకతాయిల వేధింపులను ఎదుర్కొంటారు. ఏదో ఒకరూపంలో వేధింపులకు గురవుతున్న తరుణంలో ఈ విద్య ఎంతో ప్రయోజనం కలిగించనుంది.
ఆత్మ విశ్వాసం పెరుగుతుంది : అనూష, 9వ తరగతి, కేజీబీవీ చెట్టుపల్లితండా, దుద్యాల మండలం బాలికల ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పాలని నిర్ణయించడం సంతోషం. అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడానికి ఈ విద్య ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మరక్షణ, శారీరకంగా దృఢంగా ఉండడంతో ఏదైనా అపాయం ముంచుకొస్తే తమను తాము రక్షించుకోవడంతోపాటు ఇతరులను కూడా కాపాడే అవకాశం కలుగుతుంది.
నేటి నుంచి నెల రోజులపాటు అమలు : సంధ్య, జీఈసీవో(జెండర్ ఈక్విటీ కో-ఆర్డినేటర్) జిల్లాలోని ఎంపిక చేసిన 205 కేజీబీవీలు, ఉన్నత పాఠశాలల్లో బాలికలకు నేటి నుంచి ఆత్మరక్షణ విద్య కార్యక్రమాన్ని నెల రోజులపాటు అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల బాలికలు తమను తాము కాపాడుకునే అవకాశం కలుగుతుంది. బాలికలకు ఇది ఉపయోగం. కరాటేలో శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేసిన శిక్షకులకు రూ.5వేల పారితోషికం ప్రభుత్వం అందజేస్తుంది.