మంచాల, ఫిబ్రవరి 5 : నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్న నిరుపేదలకు ఇండ్లు ఇచ్చేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఏడు బృందాలుగా విభజించారు. ఆన్లైన్లో డబుల్బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను నేరుగా సేకరించేందుకు రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి అర్హుల జాబితా తయారు చేస్తున్నారు. తహసీల్దార్ అనిత ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు.
లింగంపల్లి గేట్ సమీపంలో..
మంచాల మండలం లింగంపల్లి గేట్ సమీపంలోని సర్వే నంబర్ 100లో నాలుగెకరాల ఇరవై గుంటల భూమిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయింది. మొదటి విడతలో 99మందికి ఇండ్లను ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు. ప్రతి నిరుపేదకూ ఇంటిని నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లకు శ్రీకారం చుట్టడంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నిరుపేదల ఇంటి కల త్వరలో నెరవేరనుంది. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఇండ్లను అర్హులకు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని నోముల, లింగంపల్లి, మంచాల గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు ఇవ్వనున్నారు. మొదటి విడుతగా 99మందికి జీప్లస్-2 పేరుతో నిర్మాణ పనులు పూర్తి చేశారు.
వివరాలు సేకరిస్తున్న అధికారులు
మూడు గ్రామాలకు చెందిన అర్హులైన నిరుపేదలకు లింగంపల్లి గేట్ సమీపంలో చేపట్టిన ఇండ్ల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. అర్హులకు ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారులు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామానికీ ఏడుగురితో పంచాయతీ, రెవెన్యూ అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. ఇండ్లులేని నిరుపేదలు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను తీసుకొని నేరుగా వారి ఇంటికి వెళ్లి వారి వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో అధికారులు ఏ మాత్రం రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలపై దృష్టి పెట్టి పూర్తి చేయించారు. అర్హులకు ఇండ్లను కేటాయించనున్నారు. అర్హులైన వారు ఎక్కువగా ఉంటే ప్రజా సమక్షంలో లాటరీ పద్ధతితో ఇండ్లను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అర్హులందరికీ అందజేస్తాం
మంచాల మండలంలో లింగంపల్లి గేటు సమీపంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులందరికీ లాటరీ పద్ధతి ద్వారా అందజేస్తాం. మండలంలోని లింగంపల్లి, నోముల, మంచాల గ్రామాల్లో ఇండ్ల్లు లేని నిరుపేదలను గుర్తించేందుకు అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారు. అర్హులను గుర్తించి వారికి నేరుగా ప్రజల సమక్షంలో ఇండ్లను కేటాయిస్తాం. సీఎం కేసీఆర్ నిరుపేదలు ఆనందంగా ఉండాలని డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించారు. అర్హులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం
ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలిస్తున్నాం
డబుల్బెడ్రూం ఇండ్ల కోసం ఆన్లైన్లో లింగంపల్లి నుంచి 99 మంది, నోముల నుంచి 85, మంచాల నుంచి 217 మందితో పాటు నేరుగా తహసీల్దార్కు 282 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులను గుర్తించేందుకు వారం రోజుల నుంచి మూడు గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నాం. రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అర్హుల జాబితాను ఉన్నతాధికారులకు పంపిస్తాం.
–అనిత, తహసీల్దార్, మంచాల