షాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని నీరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా గృహ నిర్మాణశాఖ పని తీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇళ్లు లేని పేద కుటుంబాలు ఊహించని విధంగా అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఒక్క పైసా లేకుండా ప్రభుత్వమే ఇస్తుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 9వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా సామాజిక హోదాను కల్పిస్తూ పేద ప్రజలను కన్న బిడ్డలుగా చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
రాజీవ్ గృహకల్ప, ఇందిరా ఆవాస్ యోజన పథకాల్లో భాగంగా ఖాళీలను గుర్తించి వివరాలు అందజేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. డబుల్బెడ్ రూమ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియను డిసెంబర్ నెల వరకు పూర్తి చేసి వచ్చే మార్చి నెలలో ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి పీడీ రాజేశ్వర్రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు అంకంరావు, శ్రీధర్, రాజ్కుమార్ పాల్గొన్నారు.