మంచాల : గిరిజనులు ప్రతి ఏటా నిర్వహించే సీత్లా పండుగను వైభవంగా జరుపుకున్నారు. మంగళవారం మంచాల మండలంలోని బోడకొండ, కొరవాని తండా, సత్తితండా, ఆంబోతుతండా తదితర గ్రామాల్లో గిరిజన పెద్దలు భక్తి శ్రద్ధలతో సీత్లా పండుగను నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు గ్రామ సమీపంలో ఉన్న అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించడమే కాకుండా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సీత్లా పండుగ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి పెంటయ్య నాయక్, రఘునాయక్తో పాటు కార్యక్రమానికి ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తండాలోని ప్రధాన చౌరస్తాలో నృత్యాలు, ఆటపాటలతో గిరిజనులు ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గిరిజనులు పాల్గొన్నారు.