సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ)/బేగంపేట: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు దేవాలయం ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని అత్యంత వైభవంగా వివిధ రకాల బంతి పూలు, వేపాకు, పూల తోరణాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగ ముస్తాబు చేశారు. దేవాదాయశాఖ అధికారులతో పాటు తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అమ్మవారికి నేడు బోనాలు, సోమవారం రంగం నిర్వహించనున్నారు. అమ్మవారికి ఉదయం 3.30 గంటలకు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పట్టు వస్ర్తాలతో తొలి బోనం సమర్పిస్తారు. అనంతరం 4.15 గంటలకు అమ్మవారి దర్శనానికి, బోనాల సమర్పణతో పాటు సాధారణ భక్తులకు అనుమతి ఉంటుందని మహంకాళి ఆలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి వెల్లడించారు. అమ్మవారికి సాక, ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు, రంగం వేడుకల్లో భాగంగా పోతరాజుల నృత్యం, బలిగంప, గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
ఆరు క్యూలైన్లు
అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం మొత్తం ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బాటా చౌరస్తా నుంచి ఆలయానికి వచ్చే లైన్, ఎంజీ రోడ్డు రాంగోపాల్పేట్ పాత పోలీస్స్టేషన్ కొత్త ఆర్చీ గేట్ నుంచి మహంకాళి పోలీస్స్టేషన్ మీదుగా ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ జనరల్ బజార్ అంజలి టాకీస్ వైపు నుంచి వీఐపీలకు-1, సాధారణ భక్తులకు-1 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్పేట్ పీఎస్ నుంచి సాధారణ భక్తుల క్యూలైన్ ఉంటుంది. డోనర్ పాస్ల కోసం ఎంజీ రోడ్డులో ఆలయం వెనక వైపు నుంచి మరో క్యూలైన్ ఉంటుంది. ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్ ఎదురు నుంచి వీవీఐపీలకు అమ్మవారి ఆర్చిగేట్ ద్వారా అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.
భక్తుల కోసం వైద్య శిబిరాలు..
పోలీస్ స్టేషన్ ప్రాంగణం, అంజలి టాకీస్, సంతోష్ స్వీట్ హౌస్ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మూడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జనరల్ బజార్, మహంకాళి ఠాణాల వద్ద అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. ఉత్సవాలను తిలకించేందుకు దేవాలయం చుట్టూ ఆరు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక వేదికలు
జాతరను పురస్కరించుకొని దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ఏడు సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేశారు. ఆర్పీ రోడ్డు మావురాల పెద్దమ్మ గుడి, జనరల్ బజార్ జ్యోతి ఫొటో స్టూడియో, పార్క్లైన్ తరుణి దుకాణం వద్ద, విక్టోరియా గంజ్ కూడలి, మంజు టాకీస్ సమీపంలో పాలిక బజార్, బాటా సంతోషి మిఠాయి దుకాణం వద్ద సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేశారు.
బోనాలకు 150 ప్రత్యేక బస్సులు
సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సికింద్రాబాద్లో నిర్వహించే బోనాల పండగ నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం నగరంలో 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. కాగా,నగరంలో దాదాపు 19 ప్రాంతాల నుంచి బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాలకు భక్తులు చేరుకునే విధంగా ఆర్టీసీ సిటీ బస్సులను నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్లో ఆదివారం, సోమవారం నిర్వహించే ఉజ్జయినీ మహంకాళి జాతర కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు 19 ప్రాంతాల నుంచి సుమారు 8 బస్సులు నడిపిస్తామన్నారు. అలాగే 16న కార్వాన్లోని సబ్జీమండి వరకు, 17న శాలిబండలోని అక్కన్న, మాదన్న ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడిపించాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. బోనాల జాతరకు హాజరయ్యే భక్తులు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఉచితంగా భగవద్గీత
సుల్తాన్బజార్, జూలై 8: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని భగవద్గీత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్రావు పేర్కొన్నారు. సేన కార్యాలయంలో పంపిణీ చేయనున్న భగవద్గీత పుస్తకాలను ప్రదర్శించారు.
వాహనాల పార్కింగ్..
రాష్ట్రపతి రోడ్డులోని ప్యాట్నీ సెంటర్ మహబూబ్ కాలేజీ, ఎస్డీ రోడ్డులోని బెల్సన్ తాజ్ హోటల్, జనరల్ బజార్ అంజలి టాకీస్, రాణిగంజ్లోని అడివయ్య చౌరస్తా, హరిహర కళాభవన్, ఓల్డ్జైల్ ఖాన, ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద ఆరు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.
మహంకాళికి చేనేత పట్టువస్ర్తాలు..
అఖిల భారతీయ పద్మశాలి సంఘం అధ్వర్యంలో సికింద్రాబాద్ గణేశ్ దేవాలయం నుంచి ర్యాలీగా వెళ్లి మహంకాళి అమ్మవారిని చేనేత పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొట్ట మొదటి సారిగా పద్మశాలీలు తయారు చేసిన చేనేత పట్టు వస్ర్తాలు అందించడం అదృష్టమని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షురాలు వనం దుష్మంతలు పేర్కొన్నారు.
లాల్దర్వాజ బోనాలకు ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం
లాల్ దర్వాజ సింహ వాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆలయ చైర్మన్ రాజేందర్ యాదవ్ బృందం సభ్యులు శనివారం ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి.. బ్రోచర్ను అందజేశారు. 16న నిర్వహించే బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు అరవింద్ కుమార్ గౌడ్, పోసాని విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
2వేల మందితో బందోబస్తు..175 సీసీ కెమెరాలు
జాతరను పర్యవేక్షించేందుకు పోలీసులు, దేవాలయానికి సంబంధించి మొత్తంగా సుమారు 175 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాదాపు రెండు వేల మంది పోలీస్ సిబ్బంది జాతరలో విధులు నిర్వహిస్తున్నారు. భక్తులకు ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులు, ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది మూడు షిఫ్ట్ల్లో విధులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతిరోడ్, మహాత్మాగాంధీరోడ్,, బాటా చౌరస్తా, రాణిగంజ్, టుబాకో బజార్, ప్యాట్నీ తదితర ప్రాంతాల్లో రద్దీని బట్టి ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్ వద్ద కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు.
పట్టువస్ర్తాల సమర్పణ
పాతబస్తీ లాల్దర్వాజ సింహవాహని అమ్మవారికి గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం బోనాల కులవృత్తుల సంఘం వారు పట్టువస్ర్తాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కులవృత్తుల సంఘం చైర్మన్ సాయిబాబాచారి, నాయకులు నర్సింగ్రావు, శివశంకర్, శ్రీకాంత్చారి పాల్గొన్నారు.