వికారాబాద్, డిసెంబర్ 22 : ప్రభుత్వం గొల్లకురుమల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ తెలిపారు. గురువారం వికారాబాద్ సమీపంలోని అనంతపద్మనాభస్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వికారాబాద్లోని జిల్లా పశువైద్యాధికారి కార్యాలయంలో మామిడి మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పశువుల కోసం చేపట్టిన పనులు, ఉద్యోగులు, వ్యాధుల వివరాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ అనీల్ వివరించారు.
ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడుతాయనే నమ్మకంతో చేపట్టిన ఉద్యమానికి ప్రస్తుతం న్యాయం జరిగిందని వివరించారు. గొర్రెలు అందుకొని ఎంతో మంది వెనుకబడిన గొల్లకురుమలు జీవనాన్ని సాగిస్తున్నారని తెలిపారు. రెండో విడుతలో మరికొంత మంది యాదవులు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈసారి గొర్రెలను అందించేందుకు ప్రభుత్యం ప్రత్యేక ప్రణాళికను తయారు చేసిందన్నారు.
రూ.1.75లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేసి, కలెక్టర్ సహకారంతో వాటిని విడుదల చేస్తారని తెలిపారు. ఎక్కడి నుంచి అయిన గొర్రెలను కొనుగోలు చేసుకోవచ్చని, అందుకు రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్, మెడిసిన్ తదితర ఖర్చులు అందులో ఉంటాయని వివరించారు. ఈసారి రూ.250కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పశువుల కోసం 1962 వాహనాలను ఏర్పాటు చేసి తక్షణ చికిత్సలు చేస్తారని తెలిపారు. సబ్సిడీపై అందించే గొర్రెలను అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
మాంసాన్ని ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేలా రాష్ర్టాన్ని తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని వివరించారు. అంతకు ముందు అనంతపద్మనాభస్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో విజయం సాధించాలని కోరుకున్నారు. అనంతరం పశువైద్యాధికారులు, సిబ్బంది ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్ ఉన్నారు.
ధారూరు : చైర్మన్ బాలరాజు యాదవ్ను ధారూరు పశువైద్య శాఖలో అవుట్ సోర్సింగ్లో పని చేస్తున్న సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది 544 మందిని రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.