రంగారెడ్డి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు విద్యాశాఖ నిర్వహిస్తున్న ‘ఇన్స్పైర్ మనక్’పై పాఠశాలలు అంతగా ఆసక్తి చూపడం లేదు. జూలై 1 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 15తో ముగియనున్నది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు నిరాసక్తత చూపడంతో ఇప్పటివరకు కేవలం 304 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. ఉత్తమ ప్రదర్శనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతోపాటు స్టార్టప్గా అవతరించే అవకాశం ఉన్నప్పటికీ విద్యార్థులను ప్రోత్సహించకపోవడంపై పాఠశాలల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘ఇన్స్పైర్ మనక్’ పేరిట ఏటా అవార్డులను అందజేస్తున్నాయి. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు అభ్యసించే విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. ఉన్నత పాఠశాలల నుంచి ఐదు చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి మూడు చొప్పున నామినేషన్లను స్వీకరిస్తారు. పోటీల్లో పాల్గొనే పాఠశాలలు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్లో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎంపికైన విద్యార్థి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు రూ.10వేల చొప్పున పారితోషికం అందిస్తారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపిస్తారు. అక్కడ ప్రతిభ చాటితే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నది. ఈ స్థాయి ప్రాజెక్టులకు ప్రభుత్వం పేటెంట్ హక్కులను కల్పిస్తున్నది. జాతీయ స్థాయి పోటీలో రాణిస్తే రాష్ట్రపతి, ప్రధానమంత్రిని సైతం కలవొచ్చు. ప్రాజెక్టులకు వాస్తవిక రూపాన్నిచ్చి స్టార్టప్లుగా రూపొందించేందుకు సైతం ప్రోత్సాహం అందుతున్నది.
గత ఏడాది జిల్లావ్యాప్తంగా పాఠశాలలు 1,780 నామినేషన్లను అందజేయడంతో రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈసారి నామినేషన్లకు ముందుకు రాకపోవడం అందరినీ విస్మయం గొలుపుతున్నది. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు ఇన్స్పైర్కు నామినేషన్లను సమర్పించడంలో నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూళ్లు, కస్తూర్బా, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలలు కలిపి మొత్తం 1,201 పాఠశాలలు ఎస్సీఈఆర్టీలో నమోదై ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి పాఠశాలకు 5 చొప్పున మొత్తం 6,005 నామినేషన్లు రావాల్సి ఉన్నది. కానీ.. ఇప్పటివరకు వచ్చిన నామినేషన్లు కేవలం 304 మాత్రమే. ప్రైవేటు హైస్కూళ్లు జిల్లాలో 850 వరకు ఉండగా.. కేవలం మూడు పాఠశాలలు మాత్రమే ఇన్స్పైర్కు నామినేషన్ వేశాయి. ఈసారి మొత్తంగా 40 పాఠశాలలు మాత్రమే ఇన్స్పైర్లో ప్రాజెక్టుల వివరాలను నమోదు చేశాయి. వినూత్న ఆలోచనలతో రాణిస్తున్న పాఠశాల విద్యార్థులు జిల్లాలో చాలా మంది ఉన్నారు. గతంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనల్లోనూ ఎంతోమంది ప్రతిభను కనబర్చారు. ఈ ఏడాది చేవెళ్ల ఆదర్శ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న సర్పజిత్ అనే విద్యార్థి ప్రతిభ కనబర్చి జపాన్లో జరిగే ప్రదర్శనకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి నలుగురు ఎంపిక కాగా.. అందులో సర్పజిత్ ఒకరు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ఇన్స్పైర్ మనక్లో విద్యార్థులను భాగస్వామ్యులను చేయడంలో పాఠశాలల యాజమాన్యాలు చొరవ చూపకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
విద్యార్థులు బాల శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఇన్స్పైర్ మనక్ చక్కని వేదిక. ఈ పోటీలో అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా యాజమాన్యాలు ప్రత్యేక చొరవ చూపించాలి. ఇప్పటివరకు చాలా తక్కువ సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది మాదిరిగానే ఈసారి జిల్లా నుంచి అత్యధిక నామినేషన్లు నమోదయ్యేలా చూడాలి. నేడో, రేపో అన్ని పాఠశాలలతో రివ్యూ నిర్వహిస్తాం.
– సుశీంధర్రావు, డీఈవో, రంగారెడ్డి జిల్లా
విద్యార్థులు తమలోని సృజనాత్మకతను ప్రదర్శించేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఇన్స్పైర్ మనక్’ ఎంతో దోహదపడుతున్నది. అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకునేలా విద్యార్థులను పాఠశాలల ఉపాధ్యాయలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిల్లో జిల్లా ఖ్యాతిని చాటడమే గాక, విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ఏర్పడుతుంది.
– వై.శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి