రవీంద్రభారతి, జనవరి 3: ఏ దేశంలోనైతే మహిళలు గౌరవించబడుతారో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు. సావిత్రిబాయిపూలే 193వ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని మెయిన్హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మణిమంజరి సాగర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… సావిత్రిబాయిఫూలే స్త్రీల విజ్ఞానం కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప సామాజిక యోధురాలని కొనియాడారు. చదువుల తల్లి సావిత్రిబాయిఫూలే అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అని, ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఎంతోమందికి విజ్ఞానాన్ని అందించిన దివ్యజ్యోతి అని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం కొనియాడారు. అంతకు ముందు పలువురు సామాజిక ఉద్యమకారులకు సావిత్రిబాయిఫూలే అవార్డులతోపాటు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాటికొండ విక్రంగౌడ్, మణిమంజరి సాగర్, చిన్న శ్రీశైలంయాదవ్ పాల్గొన్నారు.
ఖైరతాబాద్, జనవరి 3 : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలేను తాను ఆదర్శంగా తీసుకున్నానని మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా సోమాజిగూడ ప్రెస్క్లబ్లో భారతీయ ఓబీసీ సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు సత్కార కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు విద్యనభ్యసిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారంటే..అందుకు సావిత్రిబాయి ఫూలే ఆదర్శమన్నారు. తన జీవితంలోనూ సావిత్రిబాయి పూలే స్ఫూర్తి నింపిందని, ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత చదువును ఎంచుకున్నానని తెలిపారు. ఎంఏ, ఎల్ఎల్బీ, పీహెచ్డీ చదివానని, ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్ఎం చేస్తున్నానని చెప్పారు. అనంతరం ఉత్తమ టీచర్లు, రచయితలు, వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలను సత్కరించారు.