బొంరాస్పేట, ఆగస్టు 17 : గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మే నెలలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచిన ప్రభుత్వం తాజాగా వారికి బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నది. రైతుబీమా తరహాలోనే పారిశుధ్య కార్మికులు ఏ కారణం చేత చనిపోయినా కుటుంబ సభ్యులకు లేదా నామినీకి రూ. 5 లక్షల బీమా సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియల ఖర్చులకు చెల్లించే ఆర్థిక సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీమా ప్రీమియం, అంత్యక్రియల ఖర్చులను గ్రామ పంచాయతీ నిధుల నుంచే చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 2381 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులు, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వారికి వేతనాలను అందజేస్తూ సమాజంలో గౌరవప్రదంగా, తలెత్తుకుని జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పల్లెలు, పట్టణాలు నేడు సుందరంగా, పరిశుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానిలో పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎంతో ఉంది. ప్రతిరోజూ వీధులు, రహదారులు, మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ పల్లెలు, పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.
వికారాబాద్ జిల్లాలో 2381 మంది కార్మికులు
బీమా సౌకర్యం కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 2381 మంది పారిశుధ్య కార్మికులకు ప్రయోజనం కలుగనున్నది. జిల్లాలో నాలుగు మన్సిపాలిటీల్లో 453 మంది, పంచాయతీల్లో ప్రతి 500 మంది జనాభాకు ఒక పారిశుద్ధ్య కార్మికుడి చొప్పున 566 పంచాయతీల్లో 1928 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో 181 మంది, తాండూరు మున్సిపాలిటీలో 186, పరిగి మున్సిపాలిటీలో 53, కొడంగల్ మున్సిపాలిటీలో 33 పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
పారిశుద్ధ్య పనులు చేస్తున్న పని వారికి సీఎం కేసీఆర్ మే నెలలో జీతాలు పెంచారు. ఇప్పుడు బీమా సౌకర్యంతో పాటు అంత్యక్రియల ఖర్చులను రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ సార్ ప్రజలందరికీ మంచి పనులు చేస్తున్నడు.
-దోమ రాజు, పారిశుధ్య కార్మికుడు, చౌదర్పల్లి, బొంరాస్పేట మండలం
ఆనందంగా ఉంది
బీమా సదుపాయం కల్పించినందుకు సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషపడుతున్నాం. కార్మికులు చనిపోతే కుటుంబాలు రోడ్డున పడకుండా వారికి సర్కారు అండగా నిలుస్తుంది. బీమా సదుపాయం కార్మికుల కుటుంబాలకు దీమా ఇస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో మాకు మేలు చేకూరుతున్నది.
-బుస్స పెంటమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు, దుద్యాల