సంక్రాంతి పండుగొచ్చిందంటే సంబురమే.. సంబురం.. చిన్నారుల నుంచి పెద్దల వరకు మూడు రోజులు సరదాగా గడుపుతుంటారు. అయితే పండుగ సందర్భంగా ఏ ఊరు, వాడ చూసినా క్రీడా పోటీల సందడి కనిపిస్తున్నది. యువత ఊర్ల పేర్లతో క్రికెట్ ప్రీమియర్ లీగ్లను నిర్వహిస్తున్నారు. చిన్నాపెద్ద అంతా పతంగులు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కాలనీల్లో మహిళలు, యువతులకు, పాఠశాలల్లో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో పోటీలను విజయవంతం చేసి విజేతలకు బహుమతులను అందజేస్తున్నారు.
– పెద్దఅంబర్పేట, జనవరి 13
పెద్దఅంబర్పేట, జనవరి 13 : చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు, యువత నుంచి పెద్దల వరకు అందరికీ ఇది పోటీల సమయమే. సంక్రాంతి పండుగకు ఊరూవాడా పోటీలు నిర్వహిస్తున్నారు. కొందరు ఇప్పటికే ఆయా ఊర్ల పేర్లతో క్రికెట్ ప్రీమియర్ లీగ్లు మొదలుపెట్టారు. మరికొందరు పండుగ సెలవులు మొదలుకాగానే పోటీల నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రీమియర్ లీగ్లు..
సంక్రాంతి సెలవుల్లో క్రికెట్ పోటీలు ఏర్పాటుచేయడం సాధారణమే. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్లీగ్) తరహా ఇటీవల ప్రతిచోటా ఆ ఊరి పేరుతో ప్రీమియర్ లీగ్లు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు కుంట్లూరు గ్రామంలో కుంట్లూరు ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) పెట్టారు. పోటీల్లో విజేతలకు పెద్దఎత్తున నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయిస్తున్నారు. కుంట్లూరులో కేపీఎల్ విజేతకు రూ.లక్ష బహుమతిగా ప్రకటించారు. రన్నర్కు రూ.50 వేలు బహుమతి ఇవ్వనున్నారు. ఇలా ప్రతి గ్రామంలోనూ క్రికెట్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో ఊర్లో కనీసం నాలుగైదు జట్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కాలనీల్లో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా కాలనీల అసోసియేషన్లు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాయి.
సంతోషాలు నింపే ముగ్గుల పోటీలు
సంక్రాంతి పండుగ సమయంలో గ్రామాలతోపాటు కాలనీల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. బోగికి ముందు రోజు చాలాచోట్ల పోటీల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో డప్పు చాటింపులు వేయించారు. కాలనీల్లో మాత్రం అసోసియేషన్ సభ్యులు పోటీలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. అందరూ పాల్గొనేలా ఒక్కొక్కరిని కలుస్తున్నారు. సంబురంగా పోటీలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. పోటీల్లో గెలుపొందివారికి బహుమతులు సైతం అందజేస్తున్నారు. కాలనీల్లో నెలకొంటున్న సమస్యలు, ఇతర అంశాలపై చర్చా వేదికలుగా మారనున్నాయి.
బడిలో సంక్రాంతి
ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు స్కూళ్లలోనూ సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. పాఠశాలల ఆవరణలో పిల్లలు పోటీ పడి ముగ్గులు వేస్తున్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచే విద్యార్థులకు పలుచోట్ల ప్రజాప్రతినిధుల సహకారంతో బహుమతులు అందజేస్తున్నారు. విద్యార్థులకు పండుగ ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలను జట్లుగా ఏర్పాటుచేసి రంగవల్లి పోటీలు పెడుతున్నారు. కలిసికట్టుగా ఉంటే కలిగే లాభాల గురించి వివరిస్తున్నారు. ఐక్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేలా, పని విభజనకు ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఏటా పోటీలు నిర్వహిస్తాం..
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కాలనీలో ఏటా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. మహిళలంతా పాల్గొనేలా ముందుగానే సమాచారం ఇస్తాం. అంతా కలిసి ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటారు. అసోసియేషన్ సభ్యులతోపాటు అందరూ పాల్గొంటే ఆ సంతోషమే వేరు. పోటీలప్పుడు పాటల సౌండ్ల మధ్య పిల్లలంతా ఉత్సాహంగా గడుపుతారు.
– కె.భాస్కరాచారి, మారుతీనగర్ కాలనీ ప్రెసిడెంట్, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ
విజేతలకు బహుమతులు ప్రకటించాం
ఏటా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంక్రాంతి పండుగకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. కేవలం యువకులమే అంతా కలిసి వాలీబాల్, కబడ్డీ పోటీలు పెడుతున్నాం. వివిధ జిల్లాల నుంచి దాదాపు 30 టీంలు వచ్చాయి. విజేతలకు నగదు బహుమతి ప్రకటించాం.
– పి.ప్రశాంత్చారి, కబడ్డీ టోర్నీ నిర్వాహకుడు, కుత్బుల్లాపూర్