వికారాబాద్, మార్చి 16 : వికారాబాద్ బ్రిడ్జి నిర్మాణంలో వస్తున్న సమస్యలను పరిష్కరిస్తూ రోడ్లు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గురువారం బ్రిడ్డిని పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులకు ఇప్పటికే రూ.12కోట్లు మంజూరయినప్పటికీ, పనుల జాప్యంపై తెలుసుకునేందుకు గఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కలియతిరిగారు. పనులు చేపట్టేందుకు వీలుగా బ్రిడ్జికి సమీపంలో ఉన్న క్రిస్టియన్ సంస్థ ప్రతినిధులు, అదే విధంగా అక్కడ నివాసముంటున్న ప్రజలతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రజలు, రవాణాకు ఇబ్బందికరంగా ఉన్న బ్రిడ్జి రోడ్డు పనులను చేపట్టేందుకు వీలుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్ వహిదాఖాతూన్, ఆర్అండ్బీ డీఈ శ్రీధర్రెడ్డి ఉన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ నెల జీతాలు అటెండెన్స్ యాప్ ఆధారంగానే అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో ఆయన మాట్లాడుతూ,, క్షేత్ర స్థాయి సిబ్బంది అందరికీ ఈ నెల ఖచ్చితంగా జియో అటెండెన్స్ యాప్ ప్రకారంగా జీతాలు చెల్లించాలన్నారు. జీతాల బిల్లులు చేసే ముందు సంబంధిత డ్రాయింగ్ అధికారులు ఈ నెల 22లోపు కలెక్టర్ అనుమతిని తప్పనిసరిగా పొందాలని సూచించారు. ముఖ్యంగా జిల్లా వైద్య శాఖ, పంచాయతీరాజ్, డీఆర్డీవో రెవెన్యూ శాఖల్లో ఎక్కువగా గైర్హాజరవుతున్నారని, అధికారులు పరిశీలించుకోవాలని వివరించారు. ఏమైనా టెక్నికల్ సమస్యలుంటే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రతి రోజూ కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చేవారు, సమయానికి ముందే వెళ్లిపోయేవారు, డివియేషన్ అయ్యేవారిపై దృష్టి సారించి అధికారులు వారిపై చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే తనను ముందుగానే సంప్రదించి పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. జిల్లా యంత్రాంగమంతా బాగా పని చేపి వికారాబాద్ జిల్లాను టాప్ 5లో ఉంచాలన్నారు. జిల్లాలోని గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల పనులు విజయవంతంగా నడుస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.