బడంగ్పేట్, జూన్ 17: చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెద్ద చెరువును ఆమె మంగళవారం సందర్శించారు. చెరువు పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. చెరువును చుట్టు తిరిగి పర్యవేక్షించారు. స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. బతుకమ్మ ఘాట్, వాకర్స్ కోసం ఏర్పాట్లు చేయించాలని సూచించారు.
వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్, స్ట్రీట్ లైట్స్, వాలీబాల్ కోర్ట్, క్రికెట్ గ్రౌండ్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు సుందరీకరణ పనులపై ఆరా తీశారు. సుందరీకరణ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ఆమె అధికారులతో మాట్లాడారు చెరువుకు ఆనుకొని ఉన్న వైకుంఠధామాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. చివరి మజిలీలో ప్రశాంతంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ జ్ఞానేశ్వర్, డీఈ వెంకన్న, కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, అర్కల భూపాల్ రెడ్డి, రాజ్ కుమార్, రామిడి రామిరెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మదారి రమేష్, సిద్ధల అంజయ్య, పల్లె జంగయ్య, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సోషల్ మీడియా కన్వీనర్ వీర రాఘవరెడ్డి, మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్, విజయలక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.