రంగారెడ్డి, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): ఇతర పార్టీల నేతల కోసం గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లివ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఎన్నికలకు ముందు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి యాసంగి ధాన్యాన్ని కొనాలని కోరుతూ మంగళవారం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆమె కలెక్టరేట్కు వెళ్లి అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరువు పరిస్థితులతో రైతులు కష్టాల్లో ఉండగా..ప్రభుత్వం బాధిత రైతులకు ధైర్యం చెప్పే ఆలోచన కూడా చేయకపోవడం సిగ్గు చేటన్నారు. పండిన ఆ కొద్దిపాటి పంటలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనాలని.. మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారం చెల్లించాలని.. రైతుభరోసా కింద రైతులకు ఏడాదికి రూ.15 వేల సాయం అందించాలని, కౌలు రైతులకూ అదే స్థాయిలో సాయం అందించాలన్నారు. 2 లక్షల రుణమాఫీని అమలు చేయడంతోపాటు పశుగ్రాసం పంపిణీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేసీఆర్ రైతు ఉద్యమంతో కాంగ్రెస్లో వణుకు..
కష్టాల్లో ఉన్న రైతులకు బాసటగా నిలిచేందుకు కేసీఆర్ రైతు ఉద్యమం ప్రారంభించడంతో కాంగ్రెస్ పాలకుల్లో వణుకు మొదలైందని సబితాఇంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం పాలనను గాలికి వదిలేసిందని, 110 రోజుల పాలనలో అన్నీ వైఫల్యాలే ఉన్నాయని విమర్శించారు. కరెంటు, నీళ్లు ఇవ్వకపోవడం ముమ్మాటికీ కాంగ్రెస్ నిర్లక్ష్యమేనని.. ఇది సహజంగా వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా పంటలకు ఇవ్వక రైతులను నష్టపర్చడమేగాక కేసీఆర్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ చూస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ ఒక్కరోజు పర్యటనతోనే భయపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వరద కాల్వ, సాగర్ కాల్వలకు నీటిని విడుదల చేసిందన్నారు. ఈ నీళ్లను ముందే వదిలి ఉంటే రైతులు పుష్కలంగా పంటలను పండించుకునే అవకాశం ఉండేదన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభు త్వం విఫలమైందని, కనీసం సమీక్షలు కూడా నిర్వహించడం లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల నాటి హామీలను అమలు చేయాల్సిందేనని, రైతులను ఆదుకోకుంటే దీక్షలు, ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు.
కేసీఆర్పై ఉన్న కోపం రైతులపై చూపిస్తే ఎలా..
కేసీఆర్పై ఉన్న కోపాన్ని రైతులపై చూపిస్తే ఎలా? అని ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ వాణీదేవిలు ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను మూలనపడేసే కుట్రలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. పార్టీలో చేరికలపై కాకుండా పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎండలకు పంటలు ఎండిపోతున్నాయని, ఎండిన పంటలకు పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యాసంగి ధాన్యాన్ని క్వింటాలకు రూ.500 బోనస్ ఇచ్చి కొనాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో గ్రం థాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీ కృపేశ్, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మహేందర్రెడ్డి, కౌన్సిలర్ లావణ్యారాజు, మాజీ సర్పంచ్ సురేశ్, సప్పిడి లావణ్య, శ్రీలత, ప్రవీణ్, మధు, రాంరెడ్డి, నర్సింహ, ప్రవీణ్, చంటి తదితరులు పాల్గొన్నారు.