రంగారెడ్డి, జూలై 3(నమస్తే తెలంగాణ) : రైతుబంధు సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండగా.. అన్నదాతలు మురిసిపోతున్నారు. సంబురంగా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. తరతరాలుగా వస్తున్న పెట్టుబడి కష్టాలను తీర్చిన రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ అని అన్నదాతల కుటుంబాలు జేజేలు పలుకుతున్నాయి. కాగా, సోమవారం 6 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 2,77,913 మంది రైతుల ఖాతాల్లో రూ.204. 66కోట్లు జమకాగా, వికారాబాద్ జిల్లాలో 4177 మంది రైతుల ఖాతాల్లో రూ.9 కోట్లు జమయ్యాయి. సెల్ఫోన్లలో మెసేజ్లు చూసుకున్న రైతులు మురిసిపోయారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికీ 2,24,137 మంది రైతులకు రూ.192.65 కోట్ల్లు అందాయి.