ఎల్బీనగర్, మార్చి 14: టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన లాజిస్టిక్స్ విభాగం ద్వారా కస్టమర్లకు వేగవంతంగా, భద్రతతో పార్సిళ్లను గంటల్లో గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. నెట్వర్క్, టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలాంటి జాప్యం లేకుండా పార్సిళ్లను అందజేసే విధంగా అన్ని చర్యలు తీసకుంటున్నట్లు పేర్కొన్నారు.
దిల్సుఖ్నగర్లోని హైదరాబాద్-2 డిపో ఆవరణలో మోడల్ లాజిస్టిక్స్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. అదే విధంగా టీఎస్ఆర్టీ లాజిసిక్స్ నూతన లోగో, బ్రోచర్ను సైతం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ప్రతి రోజు సగటున 15వేల పార్సిళ్లను లాజిస్టిక్స్ విభాగం గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 45.07 పార్సిళ్లను రవాణా చేశామని, సంస్థకు సుమారు రూ.80 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. కార్గో ద్వారా మరో రూ. 27 కోట్ల వరకు రాబడి సమకూరిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంస్థ ఆధ్వర్యంలో 60 కౌంటర్లు, 401 ఏజెంట్ కౌంటర్లతో నెట్వర్క్ విస్తరించి ఉన్నట్లు చెప్పారు.
ప్రజల నుంచి లాజిస్టిక్స్ విభాగానికి మంచి ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. కస్టమర్ల సౌకర్యార్థం హోం డెలివరీ, పిక్అప్ సౌకర్యాలను కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీం ద్వారా దాదాపు 25కోట్ల మంది మహిళలు, ట్రాన్స్జెండర్ ప్రయాణికులు బస్సు సౌకర్యం వినియోగించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్. కృష్ణకాంత్, ఈడీ హైదరాబాద్ జోన్ పురుషోత్తం నాయక్, ఈడీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.