టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న చరిత్రాత్మక నిర్ణయంతో మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి, ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చి ఆనందంలో మునిగితేలారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. సాహసోపేత నిర్ణయంతో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా ఆర్టీసీ ఉద్యోగులకు మేలు కలిగేలా చేశారన్నారు. పలువురు ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో తమ జీవితాల్లో వెలుగులు నిండనున్నాయన్నారు. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఆర్టీసీ సిబ్బంది, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తూ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తాము ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎన్నో ఏండ్ల కల నేటికి సాకారమైందని పేర్కొన్నారు. తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన దేవుడు కేసీఆర్ అని కొనియాడారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
తలకొండపల్లి, ఆగస్టు 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప చరిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నగరంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రజా రవాణాను పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ రోజుకు లక్షల మందికి సేవలందిస్తున్నదని.. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 43,373 మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్లో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నో ఉద్యమాలు చేసినా.. పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి, కార్మికుల కష్టాలు గుర్తెరిగిన నాయకుడు కావునే ఈ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
షాద్నగర్, ఆగస్టు 1 : ఆర్టీసీ కార్మికుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ పేరొందారని, ఆయన సేవలను ఆర్టీసీ కార్మికులు, కుటుంబాలు ఎన్నడూ మర్చిపోలేవని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ షాద్నగర్ ఆర్టీసీ డిపో ఆవరణలో మంగళవారం సీఎం కేసీఆర్ చిట్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనుండడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ కష్టాలు తీరనున్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ ఆహర్నిశలు కృషి చేస్తున్నదన్నారు. పెద్ద మనస్సుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఎం ఉష, ఉద్యోగులు పాల్గొన్నారు.
యాలాల, ఆగస్టు 1 : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం సీఎం కేసీఆర్ తీసుకొన్న గొప్ప నిర్ణయమని ఆర్టీసీ ఉద్యోగులు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ మంగళవారం తాండూరు డిపోలో సంబురాలు జరుపుకొన్నారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం ఒక్క కేసీఆర్కు మాత్రమే సాధ్యమని నినదిస్తూ కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ నిర్ణయంతో ప్రజా రవాణా మరింత పటిష్టం కానుందన్నారు. తమ జీవితాల్లో నూతన శకం ప్రారంభమైందన్నారు. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఎన్నో ఏండ్ల మా కల నేటికి సాకారమైందన్నారు. కార్యక్రమంలో సుమారు వంద మంది ఉద్యోగులున్నారు.
– కొప్పు రవీందర్, ఆర్టీసీ డ్రైవర్
ప్రజా రవాణాను పటిష్టం చేసేందుకు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం మా అదృష్టం. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 43,373 మందికి మేలు జరుగుతుంది. కేసీఆర్ కార్మికుల పక్షపాతి. మాపై ఇంతటి ప్రేమ చూపించి, మా కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ మా పాలిట దేవుడు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 1 : టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎంతో శుభపరిణామమని, దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదురుచూస్తున్న కల ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లని దీవెనతో నెరవేరిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో కార్మికులతో కలిసి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నో ఏండ్లుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఉద్యోగుల జీవితాలు మారిపోయాయని పేర్కొన్నారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు యావత్తు ఆర్టీసీ కార్మిక లోకం రుణపడి ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు ఇబ్రహీంపట్నం డిపో ఎదుట పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ అశోక్రాజు, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.
వికారాబాద్, ఆగస్టు 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశంలో టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలోవిలీనం చేయడం చాలా గొప్ప విషయమని వికారాబాద్ ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. మంగళవారం వికారాబాద్ ఆర్టీసీ డిపోలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు ఒకరినొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న 2017, 2021 వేతన సవరణలు, డీఏలు, 2014 సంబంధించిన వేతన సవరణ ఏరియర్స్, ఉద్యోగ భద్రత, సీసీఎస్ బకాయిలు త్వరలోనే ఉద్యోగులకు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల గుండెల్లో సీఎం కేసీఆర్ స్థిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
పరిగి, ఆగస్టు 1 : టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించడం చరిత్రాత్మకమైనదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగిలోని ఆర్టీసీ డిపోలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆర్టీసీ డిపో మేనేజర్ పవిత్ర, ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 43వేలకు పైగా ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడతారని పేర్కొన్నారు. మంత్రివర్గ నిర్ణయంతోపాటు ఈ నెల 3 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు సంతోషంతో సంబురాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఉద్యమ సమయం నుంచి ఆర్టీసీ ఉద్యోగుల ఇబ్బందులు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ గత 9 ఏండ్లలో అనేక విధాలుగా ఆర్టీసీని ఆదుకునే నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే సాహసోపేత నిర్ణయంతో సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు శాశ్వతంగా మేలు కలిగేలా చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, సీనియర్ నాయకుడు అనిల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
కొడంగల్, ఆగస్టు 1 : ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆర్టీసీ సిబ్బందిలో ఆనందం వెల్లివిరిసింది. మంగళవారం నియోజకవర్గం కోస్గిలోని ఆర్టీసీ డిపోలో ఎమ్మెల్మే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారని, వారి కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించి అండగా నిలిచినట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమం దిశగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని మరోమారు నిరూపితమైనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ నారాయణపేట జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, కోస్గి డిపో ఇన్చార్జి మేనేజర్ చంద్రమ్మ, కంట్రోలర్ వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.