దోమ, జనవరి 17 : మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ)లో అవకతవకలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దోమ మండలంలోని మోత్కూరు గ్రామంలో ఓ బుక్ కీపర్ చేతివాటం ఆలస్యంగా వెలుగుచూసింది. మహిళా సంఘానికి చెందిన డబ్బులు గుట్టుచప్పుడు కాకుండా కాజేశాడు. వివరాల్లోకి వెళితే మోత్కూర్లో మహిళా సంఘాల నిర్వహణ నిమిత్తం గ్రామానికి చెందిన కటికె మల్లేశం అనే వ్యక్తి బుక్ కీపర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2022 సవంత్సరం ఆగస్టు 30 వ తేదీన గ్రామానికి చెందిన శివశ్రీ మహిళా సంఘానికి దోమ ఎస్బీఐ బ్యాంకు నుంచి రూ.7.50 లక్షలు మంజూరు చేయించిన అతడు చేతివాటం ప్రదర్శించాడు.
బ్యాంకు ఉద్యోగులతో కుమ్మక్కైన మల్లేశం సదరు సంఘం ఖాతాలోకి కేవలం రూ.5 లక్షలు బదిలీ చేయించి.. మిగతా రూ.2.50 లక్షలు ఖాతాలోనే ఉంటాయంటూ సంఘం సభ్యులను నమ్మించి గుట్టు చప్పుడు కాకుండా తన భార్య ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. ఈ రుణం తిరిగి బ్యాంకుకు చెల్లించడానికి ఉపయోగపడే రిజిస్టర్ను సంఘానికి ఇవ్వకుండా బ్యాంకు మేనేజర్ను మేనేజ్ చేస్తూ కాలయాపన చేశాడు. నెలలకొద్ది బ్యాంకు చుట్టూ తిరిగినా సిబ్బంది ఏదో ఒక సాకు చెప్పి రిజిస్టర్ ఇవ్వకుండా నిరాకరించడంతో అనుమానం వచ్చిన సంఘం సభ్యులు ఐకేపీ కార్యాలయం నుంచి గ్రామానికి బాధ్యత వహిస్తున్న సీసీని సంప్రదించారు.
సీసీ జోక్యంతో బ్యాంకు సిబ్బంది రిజిస్టర్ ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై మల్లేశంను నిలదీయగా.. ఈరోజు, రేపు ఇస్తానంటూ కాలయాపన చేస్తున్నాడు. దీంతో విసిగి పోయిన సంఘం సభ్యులు బుధవారం ఐకేపీ కార్యాలయ ఏపీఎం సురేశ్ను కలిసి బాధ్యుడైన బుక్ కీపర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా బుక్ కీపర్లు మహిళా సంఘాలకు లోన్లు ఇప్పించే క్రమంలో లక్ష లోనుకు గాను రూ.1000 చొప్పున కమీషన్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మోత్కూర్ గ్రామ మహిళా సంఘానికి మంజూరైన లోన్లో జరిగిన అవకతవకలపై దోమ ఏపీఎం సురేశ్ను వివరణ కోరగా అవకతవకలకు పాల్పడ్డ బుక్ కీపర్ మల్లేశం నుంచి అట్టి డబ్బులను రికవరీ చేయించి సంఘం సభ్యులకు న్యాయం చేస్తామన్నారు. అంతేకాకుండా డబ్బులు కాజేసేందుకు సహకరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.