పచ్చదనం శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి
గ్రామపంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు
85 శాతం మొక్కలను బతికించే దిశగా అడుగులు
వికారాబాద్ జిల్లాలో 850.85 కి.మీ.. 5.89 లక్షల మొక్కలు
రోడ్లకు ఇరువైపులా నాటనున్న సిబ్బంది
పరిగి, జూలై 14 : రాష్ట్రంలో పచ్చదనం శాతాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం ద్వారా ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు చేపట్టింది. వికారాబాద్ జిల్లా పరిధిలో ఈసారి పెద్దఎత్తున రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని నిర్ణయించారు. దీంతోపాటు నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆ గ్రామ పరిధిలో నాటిన మొక్కల్లో 85శాతం మొక్కలు తప్పనిసరిగా బతికేలా చర్యలు తీసుకోవాలి. 85 శాతం కంటే తక్కువ మొక్కలు బతికితే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు పంచాయతీరాజ్ చట్టం అవకాశం కల్పించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న రోడ్లన్నింటినీ నిండుగా పచ్చదనం ఉట్టిపడేలా మార్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడంతోపాటు అన్ని మొక్కల సంరక్షణ చేపట్టాలని, 85శాతం కంటే తక్కువ మొక్కలు బతికితే, మిగతా వాటికి ఒక్కో దానికి రూ.325 పంచాయతీ కార్యదర్శుల నుంచి రికవరీకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో 850.85 కి.మీ.. 5.89లక్షల మొక్కలు
జిల్లావ్యాప్తంగా ఎవెన్యూ ప్లాంటేషన్లో 850.85 కి.మీ రోడ్లకు ఇరువైపులా 5,89,940 మొక్కల పెంపకం చేపట్టనున్నారు. 301.5 కి.మీ రోడ్లకు ఇరువైపులా స్థలం ఉన్న దగ్గర మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్లో 2,85,640 మొక్కలు, 549.35 కి.మీ రోడ్లకు ఇరువైపులా ఒకే వరుసలో 3,04,300 మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. రోడ్డు పక్కన స్థలం ఎక్కువగా ఉంటే ఇరువైపులా రెండు నుంచి మూడు వరుసల్లో సైతం మొక్కలు నాటనున్నారు. మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా జాతీయ రహదారులు 53.2 కి.మీ, రోడ్లు, భవనాల శాఖ రహదారులు 176 కి.మీ, పంచాయతీరాజ్ రోడ్లు 70.8 కి.మీ రోడ్లకు ఇరువైపులా ఒకటి కంటే ఎక్కువ వరుసల్లో మొక్కలు నాటుతారు. ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్లు, భవనాల శాఖ రహదారులు 119 కి.మీ, పంచాయతీరాజ్ రోడ్లు 430 కి.మీ రహదారుల పక్కన ఒకే వరుసలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఉపాధిహామీ ద్వారా గుంతలు తవ్వే పనులు దాదాపు పూర్తి అవుతున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే రోడ్ల పక్కన మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. రోడ్ల పక్కన పెద్ద మొక్కలను నాటించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని హెచ్ఎండీఏ ద్వారా 90వేలు, అటవీ శాఖ ద్వారా 60వేలు ఒక మీటరు నుంచి మీటరున్నరకు పైగా ఎత్తు గల మొక్కలు తెప్పించారు. పెద్ద మొక్కలు నాటడం ద్వారా మరింత త్వరగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.
మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ
ఎవెన్యూ, మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నాటిన మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏ రహదారి ఏ గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుందనేది నిర్ణయించి, ఆయా గ్రామపంచాయతీల పరిధిలో నాటిన మొక్కల్లో 85శాతం బతికించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాధ్యతను గ్రామపంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. నాటిన వాటిలో 85 శాతం మొక్కలు బతికితే, మిగతావాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటాల్సి ఉంటుంది. అలాకాకుండా 85శాతం లోపు మొక్కలు బతికితే మిగతావాటికి ఒక్కో మొక్కకు రూ.325 చొప్పన గ్రామపంచాయతీ కార్యదర్శుల నుంచి రికవరీ చేయాలని నిర్ణయించారు. ఒక మొక్క నాటేందుకు గుంత తవ్వడానికి రూ.60, నాటేందుకు రూ.25, ఊత కర్రకు రూ.17, ఎరువులు, ఇతర ఖర్చులు రూ.25, ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే ఒక్కో మొక్కకు రూ.170 చొప్పున ఖర్చవుతుంది. అలాగే ప్రతి 400 మొక్కల సంరక్షణకు వాచర్కు రోజుకు రూ.250 చొప్పున అందజేయనున్నారు. ఒక మొక్క కోసం ఈ స్థాయిలో ఖర్చు చేసి, నాటిన తర్వాత బతికించకుంటే డబ్బులు వృథాగా పోతాయి. అందువల్ల నాటిన ప్రతి మొక్క బతికించాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంది. ప్రతి గ్రామ పరిధిలో హరితహారంలో నాటిన మొక్కలు 85శాతం వరకు బతికించాలని, లేకపోతే గ్రామపంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణా చర్యలకు పంచాయతీరాజ్ చట్టంలోనే పొందుపరచగా జిల్లాలో మొక్కల ఖర్చు రికవరీకి కలెక్టర్ నిర్ణయించారు. గతంలో మొక్కలు బతికించాలంటే నీరు పోసేందుకు ఇబ్బందులు ఉండేవి. ప్రస్తుతం ప్రతి గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్యాంకర్ సైతం ఉన్నాయి. వేసవిలోనూ ట్యాంకర్ ద్వారా నీరు పోసి బతికించేందుకు అవకాశం ఉన్నది. అందువల్ల మరింత పకడ్బందీగా మొక్కల పెంపకం కార్యక్రమం చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ప్రతి మొక్కను బతికించాలన్నది ఉద్దేశం
– కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా
హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను బతికించాలన్నది ప్రధాన ఉద్దేశం. నాటిన మొక్కల్లో 85 శాతం తప్పనిసరిగా సంరక్షించబడాలన్నది పంచాయతీరాజ్ చట్టంలోనే పేర్కొనబడింది. మిగతా 15 శాతం మొక్కలు మళ్లీ నాటడం ద్వారా సంరక్షించాలి. ఈసారి జిల్లా పరిధిలో 850.85 కి.మీ రోడ్ల వెంట 5,89,940 మొక్కలు నాటాలని నిర్ణయించాం. ప్రతి మొక్క సంరక్షించబడేలా గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 85శాతం కంటే తక్కువ సంరక్షించబడితే ఒక్కో మొక్కకు రూ.325 చొప్పున పంచాయతీ కార్యదర్శుల నుంచి రికవరీకి కలెక్టర్ నిర్ణయించారు.