చేవెళ్ల రూరల్, డిసెంబర్ 11 : రైతులు పంట పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద గ్రామంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య శుభోదయం కార్యక్రమంలో భాగంగా రైతులు పంట పొలాలకు వెళ్లడానికి రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్కు సమస్య పరిష్కరించాలని సూచించారు.
దీంతో ఆదివారం చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి సొంత నిధులతో రోడ్డును వేయించే పనులు జేసీబీలతో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అతి తొందరలోనే రోడ్డు పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.