కేశంపేట, జనవరి 27 : కేశంపేట మండలంలోని బొదునంపల్లి, కాకునూరు గ్రామాల మధ్య అక్రమంగా నిర్వహిస్తున్న కృత్రిమ ఇసుక ఫిల్టర్లను రెవెన్యూ అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ధ్వంసం చేయించారు.
రెండు గ్రామాల మధ్య కొందరు వ్యక్తులు వ్యవసాయ పొలాల్లోంచి మట్టిని తరలిస్తూ అక్రమంగా ఇసుక ఫిల్టర్ల ద్వారా కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారని ఆయా గ్రామాల రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. వ్యాపారులు ఇసుక ఫిల్టర్ల ద్వారా కృత్రిమ ఇసుకను తయారు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని తాసీల్దార్ ఆజం అలీ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఆర్ఐ నివేదిత, పోలీసులు, వీఆర్ఏలు పాల్గొన్నారు.