వికారాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): 33 ఏండ్ల తర్వాత వికారాబాద్ జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుముల రేవంత్రెడ్డి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వికారాబాద్ ప్రాంతం నుంచి రెండో వ్యక్తి సీఎం అవుతుండడం విశేషం. మొదటగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలోని మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
వికారాబాద్, తాండూరు ద్విశాసన సభల నుంచి ఎన్నికైన మర్రి చెన్నారెడ్డి సీఎంగా పనిచేయగా, నేడు జిల్లా నుంచి ఎన్నికైన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి వరించింది. అయితే వికారాబాద్ నుంచి ఎన్నికైన అనంతరం 1978-80 వరకు, తాండూరు నుంచి ఎన్నికైన అనంతరం 1989-90 మధ్య మర్రి చెన్నారెడ్డి రెండు పర్యాయాలు సీఎంగా పనిచేయగా, సరిగ్గా 33 ఏండ్ల తర్వాత జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం కావడంతో రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్తోపాటు వికారాబాద్ జిల్లాకు మహర్దశ రానున్నదని జిల్లా ప్రజానీకం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.