రంగారెడ్డి, మే 12 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల ఆంక్షలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం హడావుడిగా కేంద్రాలను ప్రారంభించినా అక్కడ వడ్లను కాంటా పెట్టేందుకు పలు కొర్రీలు విధిస్తుండటంతో రైతులు జంకుతున్నారు. అధికారుల ఆంక్షలు తట్టుకోలేక కొందరు తక్కువ ధరకే మధ్యదళారులకు విక్రయించి నష్టపోతున్నారు. జిల్లాలో వరికోతలు ముమ్మరమైనా కొనుగోలు కేంద్రాల్లో మా త్రం అధికారులు ఆశించిన స్థాయిలో సేకరించడంలేదని రైతులు వాపోతున్నారు.
ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకెళ్తే తేమశాతం పేరుతో అక్కడే వడ్లను ఎండబెట్టేలా చేస్తున్నారు. అనంతరం తాలు అధికంగా ఉందన్న సాకుతో మరింత జాప్యం చేస్తుండడంతో అన్నదాతలు వారాల తరబడి అక్కడే పరిస్థితులు ఉంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వారాల తరబడి ఉంటుండటంతో ఇటీవల రాయపోల్ గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద వడదెబ్బకు రైతు గౌరయ్య మృతిచెందాడు.

రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు అధికారులు జిల్లాలో 37 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఐకేపీ 9, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 5 కాగా మిగిలినవి సహకారసంఘాల పరిధిలో కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ఈ ఏడాది 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఇప్పటివరకు 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనలేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలుతెప్పలుగా నిల్వ ఉన్నా అధికారులు మాత్రం సకాలంలో సేకరించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కేంద్రాల వద్ద వారాల తరబడి నిరీక్షిస్తున్నా కాంటా చేయకపోవడంతో విసుగు చెంది తక్కువ ధర వచ్చినా సరే అని మధ్యదళారులను విక్రయించి నష్టపోతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో అధికారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. క్వింటాల్కు రెండు కిలోలు, ఆయా రైస్మిల్లుల్లో మరో రెండు కిలోల చొప్పున తరుగు తీసేస్తున్నారు. దీంతో క్వింటాల్కు రైతు నాలుగు కిలోల వరకు తరుగును భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే, కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కూలిని కూడా రైతులే భరించాలి. ఈ పరిస్థితిలో రైతులకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి కనిపించటంలేదు.
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రాల సిబ్బంది రైతును మోసం చేస్తున్నారు. తరుగు పేరుతో క్వింటాకు నాలుగు కిలోల వరకు అన్నదాత నష్టపోవాల్సి వస్తున్నది. అయినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణం. కేంద్రాల్లోని పలు కొర్రీలు పెడుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న స్వేచ్ఛగా అమ్ముకోలేని దుస్థితి నెలకొన్నది. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు.
-మొద్దు అంజిరెడ్డి, రైతు