యాచారం, జనవరి 24 : గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాల పనితీరు భేషుగ్గా ఉందని ఐడీబీఐ బ్యాంకు అధికారుల ప్రతినిధుల బృందం కితాబిచ్చారు. మండలంలోని నల్లవెల్లి గ్రామంలో పొదుపు సంఘాల పనితీరును అధ్యయనం చేయడానికి హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, త్రిపుర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ర్టాలకు చెందిన 35మంది ప్రతినిధుల బృందం మంగళవారం పర్యటించారు. గ్రామ సంఘాల సభ్యులతో వారు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. చిన్న సంఘాల పనితీరు, గ్రామ సంఘాల లైన్ మీటింగ్, లావాదేవీల అకౌంటింగ్ జరుపుకొనే విధానాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సంఘాల కార్యనిర్వాహణ సమావేశాలను వారు పర్యవేక్షించారు.గ్రామంలో పొదుపు సంఘాల ద్వారా డ్వాక్రా రుణాలతో ఏర్పాటు చేసుకున్న కిరాణా షాపులు, చికెన్ షాపులు, పంక్చర్ షాపు, దాణా తయారీ, పిండి గిర్నీ దుకాణాలను సందర్శించి వారు స్వయంగా పరిశీలించారు. వాటి పెట్టుబడి, రోజువారీ ఆదాయానికి సంబంధించిన వివరాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు లింకేజీకి సంబంధించిన డిజిటల్ హెచ్ఎల్పీ జీవనోపాధి ప్రణాళికలను ఎలా రూపొందిస్తారు అనే అంశాన్ని వారు సేకరించారు. రుణాలు ఎలా తీసుకుంటారు, తిరిగి ఎలా చెల్లిస్తారు అనే విషయాలను డ్వాక్రా మహిళల ద్వారా తెలుసుకున్నారు.
ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్తో సమావేశం
యాచారంలో ఉన్న ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్తో వారు సమావేశమయ్యారు. రైతు సంఘాల గురించి సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని వివిధ బ్యాంకు మేనేజర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో పొదుపు సంఘాలకు అందజేసిన రుణాలు, పొదుపు, వసూళ్లు చేసే విధానాల వివరాలను సేకరించారు. బ్యాంకు రుణాలను మహిళలు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో మహిళా పొదుపు సంఘాల పనితీరు బాగుందన్నారు.
బ్యాంకు రుణాలు తీసుకోవడం, రుణాలతో చిరు వ్యాపారాలు పెట్టుకొని జీవనోపాధి పొందడం, తిరిగి రుణాలు సకాలంలో చెల్లించడం ఎంతో బాగుందన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు సొంత కాళ్లపై నిలబడి స్వయం ఉపాధి పొందుతూ స్వశక్తితో ఎదగడం అభినందనీయమన్నారు. బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, డిప్యూటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బుచ్చిబాబు, డిప్యూటీ ట్రైనీ జనరల్ మేనేజర్ భాస్కర్రావు, అడిషనల్ డీఆర్డీవో జంగారెడ్డి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బాలరాజ్, ఏపీఎం సతీష్, సీసీలు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.