రంగారెడ్డి, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ, ఆయన స్ఫూర్తితో సామాజిక అభివృద్ధికి బాటలు వేసుకున్నామని.. ప్రణాళికలు రచించుకొని ప్రగతి మార్గాన పయనిస్తున్నాం అని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. 74వ భారత గణతంత్ర దిన వేడుకలు రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడారు.
రైతులకు అందుబాటులో సేవలు
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి అమలు చేస్తున్న రైతు బీమా పథకం మరణించిన రైతు కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. రైతులకు లక్ష రూపాయలలోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్నదని తెలిపారు. మొదట విడుతగా జిల్లాలో పదివేల 940 మంది రైతులకు రూ.25వేల లోపు ఉన్న పంట రుణాలు మొత్తం రూ.16కోట్ల73 లక్షలు, రెండో విడుతలో రూ.50వేల వరకున్న పంట రుణాలు మొత్తం రూ.31కోట్ల14 లక్షల పంట రుణాలను 9 వేల 579 మంది రైతులకు మాఫీ చేసిందని ఆయన పేర్కొన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా జిల్లాలో 83 రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్లలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్లు అమయ్కుమార్, నిఖిల జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ గీతాలాపన చేశారు. వివిధ శాఖల ద్వారా జిల్లాల్లో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలకోపన్యాసం చేశారు. రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకొని తమ ప్రదర్శనలతో గణతంత్ర వేడుకలకు వన్నెలద్దారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు కలెక్టర్లు ప్రశంసాపత్రాలు అందజేశారు.