బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబాలకు భరోసానిస్తున్నది. పార్టీ నిధుల నుంచి ప్రీమియం చెల్లిస్తున్నది. దురదృష్టవశాత్తూ ఎవ్వరైనా చనిపోతే.. అతడి కుటుంబానికి రూ.2లక్షల చొప్పున పరిహారం అందించి ఆదుకుంటున్నది. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో 83 బాధిత కుటుంబాలకు బీమా సొమ్మును అందించారు.
కార్యకర్తలే కొండంత బలం అని ఎన్నో సమావేశాల్లో పదేపదే చెప్పే బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచిత బీమా సౌకర్యం కల్పించి.. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల బీమాను అందజేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 2015 నుంచి నేటి వరకు 83 కుటుంబాలకు బీమాను అందజేసి ఆయా కుటుంబాల్లో భరోసాను నింపింది బీఆర్ఎస్ పార్టీ. మృతిచెందిన కార్యకర్త కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ సొమ్మును క్లెయిమ్ చేసుకునేందుకు తెలంగాణ భవన్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు పార్టీ కల్పిస్తున్న భరోసాతో విధేయులుగా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న చాలామంది బీఆర్ఎస్లో చేరి సభ్యత్వం తీసుకుంటున్నారు.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ)
గులాబీ పార్టీ తమ కార్యకర్తలకు బాసటగా నిలుస్తున్నది. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు ఆపన్నహస్తం అందించి ఆదుకుంటున్నది. కంటిపాపలా కార్యకర్తలను కాపాడుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదినుంచీ పటిష్ట కార్యాచరణను అమలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా 2015-16 తర్వాత పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించి ఆపదలో అండగా నిలుస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి విధేయులుగా ఉండేందుకు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఎంతోమంది పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 2015-16 నుంచి 2022-23 వరకు 83 కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఆసరాగా నిలిచింది. ఇన్సూరెన్స్ సొమ్ము రూ.2లక్షలను ఆయా కుటుంబాలకు అందజేసి భరోసాను కల్పించింది. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో 25 కుటుంబాల వరకు బీమా సాయం అందగా.. షాద్నగర్ నియోజకవర్గంలో 17 కుటుంబాలకు, చేవెళ్ల నియోజకవర్గంలో 23 కుటుంబాలకు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 18 మందికి సాయం అందించి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది.
పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని బీఆర్ఎస్ పార్టీ కల్పిస్తున్నది. ప్రతి రెండేండ్లకోసారి చేపట్టే బీఆర్ఎస్ పార్టీ సాధారణ సభ్యత్వానికి రూ.30, క్రియాశీల సభ్యత్వానికి రూ.100 చొప్పున రుసుమును తీసుకుంటుండగా.. ఇన్సూరెన్స్ సొమ్మును బీమా సంస్థలకు బీఆర్ఎస్ పార్టీయే చెల్లిస్తున్నది. కార్యకర్త కానీ.. నాయకుడు కానీ.. అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి బీమా కింద రూ.2లక్షల సాయం అందుతున్నది. 69 ఏండ్లలోపు ఉండి ప్రమాదవశాత్తు మరణించినవారికి ఈ బీమా వర్తిస్తుంది. బీమా క్లెయిమ్స్ కోసం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబ సభ్యులు కార్యకర్త మరణించిన 60 రోజుల్లోగా సంబంధిత విభాగంలో నిర్దేశిత పత్రాలను సమర్పించాలి. పూర్తి వివరాలను నమోదు చేసుకుని ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి క్లెయిమ్ సకాలంలో వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్లెయిమ్స్ దరఖాస్తులను సమర్పించేందుకు వచ్చే ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆత్మీయంగా చూసుకోవడంతోపాటు భోజన సదుపాయాలను సైతం తెలంగాణ భవన్లో కల్పిస్తున్నారు.
విధి వంచించింది. అకాల మృత్యువై మా ఇంటి పెద్దదిక్కును బలితీసుకున్నది. కానీ.. బీఆర్ఎస్ పార్టీ మా కుటుంబాన్ని నీడలా కాపాడుతున్నది. 2015లో మా నాన్న మాసన్నగారి వెంకట్రెడ్డిని పొలం కాడ పాము కాటేయడంతో చనిపోయాడు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో రూ.2లక్షల సాయం అందింది. జెండా మోసిన కార్యకర్తలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నరు. బీఆర్ఎస్ పార్టీకి మా కుటుంబం రుణపడి ఉంటది. మా కుటుంబసభ్యులందరం రెండేళ్లకోసారి తప్పనిసరిగా సభ్యత్వం తీసుకుంటున్నం.
– మాసన్నగారి నవాజ్రెడ్డి, దేవునిఎర్రవెల్లి, చేవెళ్ల మండలం
ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన ప్రమాద బీమా మా కుటుంబానికి ఆదెరువు అయ్యింది. నా వివాహం కడ్తాల్ గ్రామానికి చెందిన కంబాలపల్లి శ్రీశైలంతో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉన్న నా భర్త 2022 జనవరి నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలో మా కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండగా బీఆర్ఎస్ ప్రమాద బీమా ఆదుకున్నది. నా భర్తకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో జడ్పీటీసీ దశరథ్నాయక్ సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమాకు దరఖాస్తు చేసుకున్నాను. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకారంతో రూ.2 లక్షల చెక్కు మంజూరైనది. బీఆర్ఎస్ పార్టీ అందించిన బీమా డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఆపద సమయంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతరం రుణపడి ఉంటాను.
– కంబాలపల్లి సంధ్య, కడ్తాల్ మండలం
నందిగామ గ్రామానికి చెందిన కృష్ణయాదవ్ కూలీ పనులు చేసుకుంటూ భార్యా పిల్లలను పోషించుకునేవాడు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో నా భర్త కృష్ణ మృతిచెందడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన నా భర్తకు పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా రూ.2లక్షలు వచ్చాయి. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, పార్టీ నాయకులు మా ఇంటికి వచ్చి నాకు, పిల్లలకు ధైర్యం చెప్పి రూ.2లక్షల చెక్కును అందజేశారు. ఇప్పటికీ స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాకు అండగా నిలుస్తున్నారు. ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బులు మాకు ఎంతో ఉపయోగపడ్డాయి.
– అనిత, నందిగామ
బీఆర్ఎస్ పార్టీ సభ్యత బీమా పథకం మా కుటుంబానికి ఎంతో ఉపయోగపడింది. నా భర్త రమేశ్ బైక్ యాక్సిడెంట్లో మరణించాడు. నా భర్తకు బీఆర్ఎస్ పార్టీ సభ్యతం ఉన్నందున నాకు బీమా పథకం ద్వారా 2 లక్షలు అందజేశారు. వాటితో నా పిల్లలను చదివించుకుంటున్నాను. కేసీఆర్కు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
– రాశిక రజిత, గ్రామం నల్లచెరువు, మాడ్గుల మండలం
కుటుంబానికి ఆధారమైన పెద్దదిక్కును కోల్పోయిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ అందజేసిన ఇన్సూరెన్స్ మాకు ఆధారమైంది. మాది కేశంపేట మండలం అల్వాల గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబం. నా భర్త మెతుకుపల్లి నర్సింహ, నేను కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. నా భర్త నర్సింహ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మా పరిస్థితి దయనీయంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న నా భర్త నర్సింహకు రెండు లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చింది. వెంటనే పార్టీ తరపున ఇన్సూరెన్స్ డబ్బులు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో మా కుటుంబానికి అందజేశారు. ఆ డబ్బులు మాకు ఆదెరువుగా మారి బతుకుదెరువు ఏర్పరుచుకున్నాం. మా కుటుంబాన్ని ఆదుకున్న బీఆర్ఎస్ పార్టీకి మా కుటుంబం ఎల్లవేళలా రుణపడి ఉంటుంది.
– మెతుకుపల్లి రోషమ్మ, అల్వాల, కేశంపేట మండలం
బీఆర్ఎస్ పార్టీ ఓ కుటుంబం లాంటిది. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా సీఎం కేసీఆర్ చూసుకుంటున్నరు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నరు. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఏదైనా జరిగితే వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రమాద బీమా కింద రూ.2లక్షలు అందజేస్తున్నరు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు నేను సైతం ఎల్లవేళలా అండగా ఉంటూ వస్తున్నాను.
– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు స్థాపించిన పార్టీలో మా భర్త రహీం చురుకైన పాత్ర పోషించేవాడు. పార్టీ కోసం ప్రతిక్షణం పరితపించి మృతిచెందడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి మా భర్త పేరుపై రూ.2లక్షల బీమా అందింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే కిషన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– షేక్ గౌసియా, ఇబ్రహీంపట్నం
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అదుకోవడంగా సంతోషంగా ఉంది. నా భర్త బేగారి దశరథ ప్రమాదవశాత్తు చనిపోతే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండటంతో పార్టీ చేసిన ఇన్సూరెన్స్ రూ.2లక్షలను అందజేసి నా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆ డబ్బులు మాకెంతో ఉపయోగపడ్డవి. మా పిల్లల చదువులకు, మా ఇంటి ఆవసరాలకు, పొలం పనులకు ఖర్చు పెట్టుకున్నాం. ఆపదలో మాకు బీఆర్ఎస్ పార్టీ ఎంతోగానో మేలు చేసింది. కేసీఆర్ గారికి మా కుటుంబం రుణపడి ఉంటుంది.
– బేగారి వసంత, కమ్మెట గ్రామం, చేవెళ్ల మండలం
ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు పార్టీ నుంచి ఇన్సూరెన్స్ చేయించి వారికి ధైర్యాన్నిస్తూ అండగా నిలుస్తున్నది. దీంతో కార్యకర్తలు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ప్రమాద బీమాతో మృతుల కుటుంబాలకు ధైర్యాన్నిస్తున్నది. ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్న కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం.
– రాజు, పార్టీ మండల అధ్యక్షుడు, కులకచర్ల
మండలంలోని చిట్లపల్లి గ్రామానికి చెందిన నా భర్త అబ్దుల్ హుస్సేన్ రెండు సంవత్సరాల క్రింతం చిట్లపల్లి గేటు సమీపంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదే సమయంలో 2022లో బీఆర్ఎస్ పార్టీ అందించిన ప్రమాద బీమా రూ.2 లక్షల చెక్కును ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అందించారు. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. వచ్చిన డబ్బులతో మాకున్న మూడు ఎకరాల భూమిలో పనులు చేసుకోవడంతో పాటు అప్పులు తీర్చుకొని కొడుకును చదివించుకుంటున్నా. ప్రస్తుతం కొడుకు సలీం ఇంటర్ చదువుతున్నాడు. కూలి పనులు చేసుకుంటూ ప్రస్తుతం ఎటువంటి లోటు లేకుండా కుటుంబం గడుస్తున్నది. దీనంతటికీ సీఎం కేసీఆర్ అందించిన ప్రమాద బీమా సౌకర్యమే కారణం.
– బిజానీ బేగం, చిట్లపల్లి గ్రామం, కొడంగల్ మండలం