అన్నదాతల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తున్నది. సాగు మొదలు పంట చేతికొచ్చాక ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఏ కారణం చేతనైనా అన్నదాత మృతి చెందితే ఆ కుటుంబం ఆగం కావొద్దన్న సదుద్దేశంతో రైతు బీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ప్రతి రైతు పేరిట ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తూ కొండంత అండగా నిలుస్తున్నది. ఈ ఏడాదికి సంబంధించి కొత్తగా పాసుపుస్తకాలు పొందిన రైతులను రైతుబీమా పథకంలో చేర్పించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది. నేటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుండగా, వచ్చే నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా ఎవరైనా ఇదివరకే పాసు పుస్తకాలు కలిగి ఉండి బీమాలో చేరనివారికీ మరోసారి అవకాశం కల్పించింది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు 39,967 మంది ఉండగా.. పాసు పుస్తకాలు కలిగిన రైతులు మొత్తం 3,94,066 మంది ఉన్నారు. ఈ కొత్త పాలసీ ఆగస్టు 14 నుంచి అమల్లోకి రానున్నది. ఇప్పటివరకు జిల్లాలో 4,413 మంది రైతు కుటుంబాలకు రూ.200.20కోట్ల బీమా సాయాన్ని ప్రభుత్వం అందజేసి ఆదుకున్నది.
– రంగారెడ్డి, జూలై 9 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూలై 9 (నమస్తే తెలంగాణ) : ‘రైతు బీమా’తో రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కూడా భరోసా కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు అర్హులైన వారందరినీ ‘రైతు బీమా’ పథకంలో చేర్పించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయశాఖ కసరత్తు మొదలుపెట్టింది. బీమా సాయాన్ని మరికొంత మందికి అందించాలన్న సదుద్దేశంతో కొత్తగా పాసుపుస్తకాలు పొందినవారితోపాటు.. ఇంతకుముందే పాసుపుస్తకాలు వచ్చినా.. రైతు బీమాకు దరఖాస్తు చేసుకోనివారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు 39,967 మంది ఉండగా.. జిల్లాలో పాసు పుస్తకాలు కలిగిన రైతులు మొత్తం 3,94,066 మంది ఉన్నారు. సోమవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. వచ్చే నెల 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా.. కొత్త పాలసీ ఆగస్టు 14 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటివరకు జిల్లాలో 4,413 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.200.20కోట్ల బీమా సాయాన్ని అందజేసింది.
ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి..
రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారు. పంట పెట్టుబడికి ఇబ్బందులు లేకుండా ప్రతి సీజన్కు ముందే రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందజేస్తుండగా.. ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబానికి రైతు బీమా పథకం కింద రూ.5లక్షల బీమా సొమ్మును అందించి భరోసా కల్పిస్తున్నది. రైతు బీమా పథకాన్ని 2018 ఆగస్టు 14 నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకంలో చేరిన ఒక్కో రైతుకు ప్రతి యేటా ప్రీమియం డబ్బును ఎల్ఐసీకి ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తున్నది.
ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు
రైతు బీమాలో ఇప్పటికే నమోదై ఉన్న రైతుల పాలసీని రెన్యువల్ చేయడంతోపాటు కొత్తవారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. 18 నుంచి 59 ఏండ్లలోపు వయసు ఉన్న రైతులందరికీ రైతు బీమా వర్తించనుండగా.. గ్రామాలవారీగా విస్తరణాధికారులు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన వారి పేర్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. పాత జాబితాలోని అనర్హులను, చనిపోయినవారిని తొలగించే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన జిల్లా వ్యవసాయ శాఖ పాత రైతులకు యథావిధిగా బీమాను రెన్యువల్ చేసి కొత్త ఐడీ నంబర్లను ఇవ్వనున్నది. నామినీ పేర్లు, బ్యాంక్ అకౌంట్, పాస్ బుక్ నెంబర్, ఆధార్ నంబర్, నామినీ, చిరునామా వంటి వివరాలు బీమా పథకంలో సరిగా లేకుంటే సవరించుకునేందుకు కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తున్నది. ఈ ఏడాది జూన్ 18 వరకు భూముల రిజిస్ట్రేషన్ అయిన రైతులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా.. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
గుంట భూమి ఉన్న రైతుకూ వర్తింపు
రైతు బీమాకు దరఖాస్తు చేసుకుంటున్న రైతుల సంఖ్య ప్రతి యేటా పెరుగుతూ వస్తున్నది. గుంట భూమి ఉండి పట్టా పాసుపుస్తకం పొంది ఉన్నా.. రైతుగా పరిగణించి ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నది. దీంతో చాలామంది ఎంతో కొంత భూమిని కొనుగోలు చేస్తున్నారు. అలాగే.. కుటుంబంలో ఒకరిద్దరి పేరుపై ఉన్న భూమిని మిగతా సభ్యులు తలా కొంత మార్చుకోవడంతో రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. దీనికితోడు రైతు బీమాకు ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించడంతో ప్రతి యేడు రైతు బీమాకు దరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ ఏడాది కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు 39,967 మంది ఉండగా.. జిల్లాలో పాసు పుస్తకాలు కలిగిన రైతులు 3,94,066 మంది ఉన్నారు. ఈ ఏడాది జిల్లాలో రైతు బీమాకు మూడున్నర లక్షలకు పైగా రైతులు అర్హత పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
రైతు మరణించిన పది రోజుల్లోనే..
రైతు బీమా పథకం జిల్లాలో వేల మంది రైతు కుటుంబాలకు అండగా నిలిచింది. 2021-22లో 942 మంది, 2022-23లో 655 రైతు కుటుంబాలను రైతు బీమా కింద ప్రభుత్వం ఆదుకుంది. గడచిన ఐదేండ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా 4,413 మంది రైతులు మరణించగా.. వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున రూ.200.20కోట్ల బీమాను క్లెయిమ్ చేసింది. రైతు మరణించిన పది రోజుల్లోనే నామినీ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేసి ఆదరువునిచ్చింది.